బీసీలను నయవంచన చేసిన సీఎం .... పదవుల పంపకాలపై టీడీపీ ఫైర్
అధికారంలోకి వస్తే యాబైశాతం మేర పదవులు బీసీలకు ఇస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి 300కు పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇక బడుగు బలహీన వర్గాలు ప్రాధాన్యత లేని పోస్టులను అప్పగించారని దుయ్యబట్టారు. దీంతో ఆయన యాబై శాతంమేర బీసీలకు పదవులనే నినాదం నయవంచనగా మారిందని విమర్శించారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఆధికార దర్పాన్ని, అహంభావాన్ని ప్రదర్శించారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సాక్షి పత్రికలో రాసిన వార్తలు తప్పుడు వార్తలేనని జగన్ స్వయంగా అంగీకరించారని యనమల అన్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలను, ఆరునెలల పాలనను టీడీపీ దీటుగా అసెంబ్లీలో ఎండగట్టిందని ఆయన తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో దిశబిల్లు తెచ్చిన ప్రయోజనం లేదని, నేరాలు మాత్రం ఆగకపోడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అత్యాచారాలు పాల్పడిన వారికి వెంటనే శిక్షలు అమలు చేయడంతో పాటు అత్యాచారాలు, హత్యలను అడ్డుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.