అమెరికాలో సీఎం జగన్ ఇలా..డల్లాస్ మీటింగ్ పైనే ఫోకస్: చివరి నిమిషంలో ఆ ఇద్దరు..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా అధికారిక సమావేశాల్లో పొల్గొంటున్న జగన్..వ్యక్తిగత పనులు సైతం ఉండటంతో సొంత ఖర్చులతోనే వెళ్లారు. జగన్ తో పాటు అధికారులు..కుటుంబ సభ్యులు ఉన్నారు. సీఎం జగన్ తో పాటుగా ముందుగా ఖరారు చేసిన జాబితాలో లేక పోయినా..చివరి నిమిషంలో మంత్రి సురేష్.. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి సైతం జగన్ తో పాటుగా అమెరికా వెళ్లారు. జగన్ ను అమెరికాలో భారత రాయబారి విందుకు ఆహ్వానించారు. అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఈ పర్యటనలో డల్లాస్ లో తెలుగు వాళ్లతో పాటుగా వైసీపీ ఎన్నారైలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ సమావేశ నిర్వహణతో పాటుగా..జగన్ అక్కడి నుండి ఏ సందేశం ఇస్తారనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తిరిగి ఈ నెల 22న జగన్ ఏపీకి తిరిగి బయల్దేరుతారు.
అమెరికాలో జగన్..షెడ్యూల్ ఇలా..
ముఖ్యమంత్రి జగన్ అధికారిక..వ్యక్తిగత పనుల కోసం అమెరికా వెళ్లారు. ఆయన 22వ తేదీ వరకు అమెరికాలో ఉంటారు. అధికారులు..కుటుంబ సభ్యులతో కలిసి జగన్ అమెరికా బయల్దేరి వెళ్లారు. అధికారిక సమావేశాలు ఉన్నా..మూడు రోజుల పాటు సొంత పనులు ఉండటంతో ఆయన వ్యక్తిగత ఖర్చులతోనే పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటనలో పలు కీలక సమావేశాలు ఉన్నాయి. అమెరికాలో భారత రాయబారి సీఎం జగన్ ను విందుకు ఆహ్వానించారు. పారిశ్రామిక ప్రముఖులతోనూ జగన్ సమావేశం కానున్నారు. ఇక, అమెరికాలో స్థిర పడిన ప్రవాసాంధ్రులతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
- ఆగస్టు 16, ఉదయం 8:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) వాషింగ్టన్ డీసీకి చేరతారు. అదేరోజు అమెరికా రాయబారితో, అమెరికా- ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం అమెరికాలో భారత రాయబారి ఆహ్వానం మేరకు విందులో పాల్గొంటారు.
- ఆగస్టు 17 మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు) డల్లాస్ చేరుకుంటారు. అక్కడి కే బెయిలీ హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
- ఆగస్టు 18న వాషింగ్టన్ డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు.
- ఆగస్టు 19, 20, 21 తేదీల్లో వ్యక్తిగత పనుల్లో ఉంటారు.
- ఆగస్టు 22న మధ్యాహ్నం షికాగోలో మరికొందరు ప్రతినిధులను కలుస్తారు. అదే రోజు రాత్రి 8:30 గంటలకు రాష్ట్రానికి బయల్దేరతారు.
డల్లాస్ సమావేశం పైనే ఆసక్తి..
ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో డల్లాస్ లో సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వైసీపీ నేతలు... నాటా నాయకులు సీఎం జగన్ ను కలిసి అమెరికాలోని పార్టీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరారు. అమెరికాలోని అన్ని సంఘాలను, కుల- ప్రాంతాలకు అతీతంగా తెలుగువారందరినీ ఒకే వేదికపైకి ఆహ్వానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే తాను వస్తానని సీఎం చేసిన సూచన మేరకు, ఈ సమావేశంలో జాతీయ తెలుగు సంఘాలను, ఇతర సంఘాలను పాలుపంచుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 17న జరగనున్న ఈ ఆత్మీయ సమావేశాన్ని తెలుగువారు ఎక్కువగా ఉండే డల్లాస్లో నిర్వహించనున్నారు. తానా, ఆటా, నాటా, నాట్స్, ఆటా తెలంగాణ, తెలంగాణ తెలుగు అసోసియేషన్, టాంటెక్స్, ఆప్తా, టీడీఎఫ్, డాటా, టీపాడ్, ఐఎ ఎన్టీ, ఎన్నారై వాసవీ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలన్నీ కలిసి ఒకే వేదిక మీదకు రావటం ఆసక్తి కర పరిణామం. సాధారణంగా తానా సంఘం ఎక్కువగా టీడీపీ నేతలకు మద్దతుగా నిలుస్తుంది. తాజాగా జరిగిన తానా సభల్లో సైతం బీజేపీ..జనసేన నేతలను..టీడీపీ నాయకులను ఆహ్వానించారు. అయితే, జగన్ మాత్రం తెలుగు వారంతా కలిసి ఒకే వేదిక మీదకు రావాలని సూచించటంతో ఇప్పుడు కొందరు నేతలు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేదిక ద్వారా జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
చివరి నిమిషంలో ఆ ఇద్దరు..
ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనలో చివరి వరకు కొందరు అధికారులకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే ముఖ్యమంత్రి సూచనల మేరకు చివరి నిమిషంలో మరో ఇద్దరు జగన్ తో పాటుగా అమెరికా వెళ్లారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా వెళ్లారు. చివరి క్షణంలో వీరి పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రితో జరిగే కొన్ని పలు కీలక సమావేశాల్లో వీరు కూడా పాల్గొంటారు. అక్కడ విశ్వ విద్యాలయాల్లో సంస్కరణల పైన అధ్యయన బాధ్యతను మంత్రి సురేష్ కు అప్పగించారు. అదే విధంగా అమెరికాలో శ్రీవారి ఆలయాల నిర్మాణం పైన కొద్ది రోజులుగా ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. దీని పైన అక్కడి ప్రతినిధులతో చర్చలు చేయనున్నారు. అమెరికా పర్యటనకు వెళ్లిన జగన్ కు ఏపీలో వరదల పరిస్థితి పైన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రికి అందచేస్తున్నారు.