క్లాజ్ష్వాప్తో సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తొలిరోజు డబ్ల్యూ ఈఎఫ్ వ్యవస్థాపకులు క్లాజ్ ష్వాప్తో సమావేశమయ్యారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను జగన్ ఆయనకు వివరించారు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉందని, అనేక రకాల పంటలకు ఏపీ ఆలవాలంగా ఉందని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని క్లాజ్ ష్వాప్ను జగన్ కోరారు.
ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యేందుకు అధికారులతో కలిసి జగన్ దావోస్ సదస్సుకు వెళ్లారు. ఈ సదస్సులోనే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటున్నారు. ఆయన హైదరాబాద్ను ఒక అవకాశంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా ప్రారంభమైంది. అధికారులంతా దావోస్ వెళ్లగా సతీసమేతంగా జగన్ లండన్ వెళ్లారని, అక్కడి నుంచి దావోస్ వచ్చారని, లండన్ వెళ్లడానికి ఆయనకు సీబీఐ కోర్టు అనుమతి ఉందా? అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. దీనిపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ముఖ్యమంత్రి లండన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.