మండలి రద్దు, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణంపై డిస్కషన్, అమిత్ షాతో జగన్ భేటీ
పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు, శాసనమండలి రద్దు తదితర అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించారు. 30 నిమిషాల పాటు రాష్ట్ర సమస్యలను అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.838 కోట్లు ఆదా చేశామని అమిత్ షాకు జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా శరవేగంతో జరుగుతోందని చెప్పారు.
హోదా కోసం
మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అమిత్ షాతో జగన్ చర్చించారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అమిత్ షాకు జగన్ తెలిపారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభఉత్వం సహకరించాలని జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీకి హోదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సీఎం జగన్ గుర్తుచేశారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
కర్నూలుకు హైకోర్టు..
కర్నూలుకు హైకోర్టు కోసం న్యాయశాఖ ఆదేశాలు ఇవ్వాలని అమిత్ షాను కోరారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉఫసంహరణ బిల్లులను కూడా చర్చించారు. మండలి రద్దు గురించి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అమిత్ షాను జగన్ కోరారు. శనివారం పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీ కానున్నారు.
రెండురోజుల్లో మరోసారి..
రెండురోజుల వ్యవధిలోనే సీఎం జగన్ ఢిల్లీ బాటపట్టారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీతో జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. తర్వాత శుక్రవారం అమిత్ షాతో భేటీ కావడం చర్చకు దారితీసింది. రాజధాని, విభజన చట్టం, అభివృద్ధి నిధుల కోసం చర్చ జరిగిందని తెలుస్తోంది. గురువారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో దాడుల వివరాలను ఐటీ శాఖ ప్రకటించిన మరునాడు సీఎం జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.