పులివెందులకు మహర్దశ.. పరిశ్రమలు, వేలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ వరాల జల్లు
కడప జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ పులివెందులలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేశారు. పులివెందులను అన్నివిధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ చెప్పారు.

పరిశ్రమలు, వేలాది మందికి ఉపాధి..
పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్లో ఆదిత్య బిర్లా ష్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే ప్రముఖ సంస్థలో ఆదిత్యా బిర్లా ఒకటని అన్నారు. ఇలాంటి కంపెనీ పులివెందులకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గార్మెంట్స్ తయారీలో ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 110 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. తొలి దశ 2 వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ఇందులో 85 శాతం మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించారని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్తులో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని పేర్కొన్నారు.

సకల సౌకర్యాలతో జగనన్న కాలనీ
అంతకుముందు పులివెందులలో జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకున్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడుతూ 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టామన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది. ఈ కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వాహబ్లు
అనంతరం సీఎం జగన్.. పులివెందుల మార్కెట్ యార్డ్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో 74 ఆక్వా హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు శిల్పారామాన్ని రూ. 13 కోట్లతో పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వంద కోట్లతో చేపట్టిన స్పోర్ట్స్ అకాడమీ అభివృద్ధి పనులను 2022 నాటికి పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు 2023 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

క్రిస్మస్ వేడుకల్లో జగన్
రేపు ( శనివారం ) క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ప్రతి ఏటా వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఇప్పటికే పులివెందులకు తన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అటు చర్చీ ఆవరణలో నిర్మించిన షాపింగ్ క్లాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. తర్వాత.. కడప ఎయిర్ పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరతారు.












Click it and Unblock the Notifications