ఏపీలో ఇసుక ఉండదు, పక్క రాష్ట్రాల్లో ఎలా..? లక్షకు చేరిన ధర, కార్మికుల గోడు పట్టదా..?
ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 40 నుంచి 50 మంది భవన కార్మికులు చనిపోతే చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఎందుకు ఆదుకోదు అని నిలదీశారు. జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. గురువారం విజయవాడలో ఇసుకదీక్ష పేరుతో చంద్రబాబు 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు.
ఇక్కడ నో.. అక్కడ మాత్రం
రాష్ట్రంలో ఇసుక ఉండదు.. కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం ఏపీ ఇసుక లభిస్తోంది అని చంద్రబాబు అన్నారు. ఆ ఇసుకను ఎవరు తరలించారు అని ప్రశ్నించారు. పైగా వరదలొస్తే ఇసుక కొరత ఏర్పడిందని కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. మరి ఇన్నాళ్లు ఎందుకు కొరత రాలేదని పేర్కొన్నారు. ఇసుకను బ్లాక్ చేయడంతో దాని ధర ఆకాశాన్ని అంటిదని చెప్పారు. దీంతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయందని చంద్రబాబు గుర్తుచేశారు.
లక్షకు చేరిన ధర..
రూ.10 వేలకు వచ్చే ఇసుక ధర లక్షకు చేరిందని పేర్కొన్నారు. దీంతో భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని చెప్పారు. మెషన్లే గాక ప్లంబర్, ఎలక్ట్రిషీయన్, పెయింటర్, కార్పెంటర్ తదితర 125 రకాల కార్మికులకు పనిలేకుండా పోయిందన్నారు. దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. వారి సీఎం జగన్కు జాలి లేదని దుయ్యబట్టారు. కార్మికులు అర్దాకలితో అలమటిస్తుంటే పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.
రూ.375 ఎందుకు..?
ఇసుకకు తరలింపునకు కనీసం రూ.375 పెట్టడం వెనక మతలబు ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ విధానం గత టీడీపీ పథకం కన్నా ఏ విధంగా మేలు అని ప్రశ్నించారు. రూ.375 కట్టి.. మళ్లీ లైన్లో నిల్చొవాలా అని నిలదీశారు. జగన్ సర్కార్ విధానాలతో పేదవాడు చితికిపోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జే ట్యాక్స్ బెదిరింపులు
మరోవైపు సిమెంట్ కంపెనీలను జే ట్యాక్స్ బెదిరిస్తోందని చెప్పారు. దీంతో కంపెనీలు ధర పెంచాయని చంద్రబాబు గుర్తుచేశారు. రూ.290 ఉన్న సిమెంట్ బస్త రూ.400కి చేరిందని చంద్రబాబు తెలిపారు. ఎన్నడూ ఇంత ధర పెరగలేదని, ఇది జే ట్యాక్స్ బెదిరింపుల ఫలితం అని చంద్రబాబు చెప్పారు. మరోవైపు లారీ అసోసియేషన్లు కూడా ఉపాధి లేక వాహనాలను అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నింాచరు.
కాలం తీరిందా..?
భవన నిర్మాణ కార్మికులు చనిపోతే కాలం తీరి చనిపోయారని సంబంధిత మంత్రి అనడంపై చంద్రబాబు స్పందించారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడాతారని ప్రశ్నించారు. అదే మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కాలం చెల్లిందని అనుకొంటారా అని నిలదీశారు. వారి ఇంట్లో చనిపోతే.. కనీసం నాలుగురోజుల వరకు బయటకు కూడా రారని.. అదే ప్రజలైతే నోటికొచ్చినట్టు మాట్లాడాతారని మండిపడ్డారు.
చంద్రన్న బీమా ఉంటే..
తమ ప్రభుత్వ పథకాలను తీసేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. తనపై కోపముంటే ప్రజావేదిక కూల్చారు. కానీ అన్నా క్యాంటిన్ ఎందుకు రద్దుచేశారని ప్రశ్నించారు. అది పేదలకు అన్నం పెట్టేది కాదా అని గుర్తుచేశారు. చంద్రన్న బీమా పథకం ఏం చేసిందని చంద్రబాబు అడిగారు. భవన నిర్మాణ కార్మికులకు ఉంటే చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షలు వచ్చేవని గుర్తుచేశారు. అంతేకాదు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నగదు రూ.800 నుంచి వెయ్యి కోట్లను ఎందుకు వ్యయం చేయడం లేదని ప్రశ్నించారు.
చేరికలా..?
రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైసీపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పెడితే.. ఇక్కడ జగన్ ఆ పార్టీ నేతలను వైసీపీలో చేర్చుకున్నారని తెలిపారు. ఇవాళ తాను ఇసుక దీక్ష చేపడితే తమ పార్టీ నేతలకు వైసీపీ కండువా కప్పారని చెప్పారు. జగన్ కుటిల, కుట్ర, కుత్రంత్ర రాజకీయాలకు వెరవని చంద్రబాబు స్పష్టంచేశారు.
బాబాయ్ చనిపోతేనే..
జగన్కు అధికారమే పరమావధి అని చంద్రబాబు దుయ్యబట్టారు. తన సొంత బాబాయ్ని దొంగలు చంపితే పట్టించుకోలేదని గుర్తుచేశారు. జగన్కు ప్రాణాల విలువ తెలియదనడానికి ఇంతకుమించిన ఉదహరణ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. తనకు అధికార దాహం లేదని.. 14 ఏళ్లు సీఎం, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని చెప్పారు. కానీ జగన్ అధికార దాహంతో ప్రజల బాగోగులు విస్మరించారని చెప్పారు. జగన్ సైకో, తుగ్లక్ అని విమర్శించారు.