తక్షణమే సాయం.. నెల్లూరులో 7 సెం.మీ వర్షం... తగ్గుముఖం పట్టిన తుపాన్..కానీ
వర్షాలతో ఎలాంటి నష్టం జరిగినా వెంటనే సహాయం అందించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నివర్ తుపాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వానల ప్రభావం, వివిధ జిల్లాల్లో పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Recommended Video
నివర్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయని.. నెల్లూరు జిల్లాలో సగటున 7 సె.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. పెన్నాలో ప్రభావం అధికంగా ఉండొచ్చని.. సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకొని నీరును విడుదల చేస్తామన్నారు. కొన్ని చోట్ల పంటలు పెద్ద ఎత్తున నీటమునిగాయని.. వర్షాలు తగ్గగానే నష్టం అంచనా వేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను అంతకంతకు తీవ్రరూపం దాల్చింది.. తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందోనని ఆందోళన నెలకొంది. అయితే తుఫాను తీరం దాటడంతో ఏపీలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తెలంగాణలో కూడా వర్షం పడుతుందనేలా వాతావరణం చల్లబడి పోయింది.
తుఫాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని వాతావరణశాఖ అధికారులు గుర్తించారు అతి తీవ్రంగా ఉన్న తుఫాను తీవ్రంగా మారింది. వచ్చే ఆరు గంటల్లో తుఫాను తీవ్రత మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది వాయువ్య దిశగా కదిలి కర్ణాటక వైపు తుఫాన్ వెళ్లే అవకాశం ఉందని.. దీంతో కర్ణాటకలోని తీరప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.