ఇడుపులపాయలో వైఎస్సార్కు జగన్ ఘన నివాళి... విజయమ్మ రాసిన పుస్తకం ఆవిష్కరణ.
నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సతీమణి,వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాసిన 'నాలో.. నాతో వైఎస్సార్' పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
Recommended Video
నాలో... నాతో... వైఎస్సార్!.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ.. సీఎం జగన్ చేతులమీదుగా..
పుస్తకంలో ప్రజలకు తెలియని వైఎస్ గురించి...
వైఎస్సార్ సహధర్మచారిణిగా వైఎస్ విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం,వైఎస్ మరణం నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం. వైఎస్ గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని వైఎస్ విజయమ్మ తన తొలి పలుకులో తెలిపారు. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, భర్తగా, నాయకుడిగా... ఇలా నిజ జీవితంలో వైఎస్సార్ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో పుస్తకంలో వివరించారు.
మరణం లేని మహా నేత... జగన్ ట్వీట్...
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... 'నాన్నగారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే.. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ప్రత్యేక జాగ్రత్తల నడుమ...
ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి వేడుకల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్ 19 ప్రోటోకాల్ను ప్రతీ ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే జయంతి కార్యక్రమానికి అనుమతించారు. కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ 19 పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.