ఆదాయం కోసం వేట మొదలెట్టిన సీఎం జగన్ .. ఎర్రచందనం , మైనింగ్ పై ఫోకస్, కీలక ఆదేశాలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలపై దృష్టిసారించారు. ఇప్పటికే రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసి రాష్ట్ర రహదారులపై టోల్ పన్ను వసూలు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్, ఇక తాజాగా రాష్ట్రంలో ఉన్న మైనింగ్, ఎర్రచందన అమ్మకంపై దృష్టి సారించనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఆదాయ సముపార్జనకు మార్గాలపై ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం జగన్ ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు అబద్ధాలకు కేరాఫ్ అడ్రెస్ .. జనం నమ్మేది జగన్ నే : మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు
ప్రభుత్వ పథకాల అమలుకు ఆదాయం అవసరం .. మైనింగ్ పై ఫోకస్ చెయ్యాలన్న జగన్
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలుకు, సంక్షేమ పథకాల అమలుకు ఆదాయం అవసరమని పేర్కొన్న జగన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆదాయ వనరులను పెంచే మార్గాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు గనుల రాబడి పెంపుపై మరింత శ్రద్ధ పెట్టాలని , సిలికా శాండ్ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎక్కడెక్కడ దృష్టిపెడితే ఆదాయం పెరుగుతుంది ఆలోచించుకుని తరచూ సమీక్షలు జరుపుకుంటూ కార్యచరణ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు .
ఏపీఎండీసీ టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల్లో పనులు ప్రారంభానికి ఆదేశం
ప్రజలపై భారం పడకుండా చూడాలని చెప్పారు .
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్న జగన్ ఏపీఎండీసీ టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల్లో కార్యకలాపాలు నిర్ణీత సమయంలోగా ప్రారంభించేందుకు అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. జార్ఖండ్ లోని బ్రహ్మదిహ , మధ్యప్రదేశ్లోని సులియారి , చత్తీస్ ఘడ్ లోని మదనపూర్ సౌత్ బొగ్గు గనులలో మైనింగ్ కార్యక్రమాలు త్వరగా ప్రారంభించాలని జగన్ పేర్కొన్నారు.
ఎర్రచందనం విక్రయానికి కేంద్రంతో చర్చించి అనుమతులు తీసుకోవాలని ఆదేశం
ఇదే సమయంలో ఎర్రచందనం విక్రయానికి కేంద్రంతో చర్చించి త్వరితగతిన అనుమతులు తీసుకురావాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 1800 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం తగ్గిందని , మరోవైపు ప్రభుత్వ నిరుపేదల కోసం అందిస్తున్న వివిధ పథకాల వల్ల ఖర్చు పెరిగిందని పేర్కొన్న జగన్ రాబడి పెరిగే మార్గాలన్నింటినీ అన్వేషించాలని రాష్ట్ర ఆదాయ వనరుల కు సంబంధించిన శాఖలపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.