షర్మిలకు జగన్ బంపరాఫర్...బాణం గురి కుదిరేనా..అక్కడ నెంబర్ వన్ పొజిషన్లో...!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపులు మీద మలుపులు తీసుకుంటున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. గతవారం మోడీని కలవడం ఆ తర్వాత అమిత్ షాతో జగన్ భేటీ అవడం.. ఆపై ఏపీలో కొన్ని వార్తలు షికారు చేయడం వంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభకు పలువురి పేర్లు వినిపిస్తుండగా... తాజాగా ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ తరపున మరో పేరు వినిపిస్తోంది. ఇంతకీ ఆ పేరు ఎవరిది..?
ఏపీ నుంచి రాజ్యసభకు షర్మిలా..?
"నేను మీ రాజన్న కూతురుని...జగనన్న విసిరిన బాణాన్ని" అనే మాటలు వింటే ఎవరో ఈ పాటికే అర్థమై ఉండాలి. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి సోదరి షర్మిలా పేరు రాజ్యసభకు వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన షర్మిలా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుటుంబ బాధ్యతలు చేపడుతున్నట్లు పలు సందర్భాల్లో కూడా షర్మిలా చెప్పారు. తాజాగా మళ్లీ షర్మిలా పేరు వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. సీఎం జగన్ ఆమెను రాజ్యసభకు పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
షర్మిలాను పార్టీలో నెంబర్ టూగా తీర్చి దిద్దే యత్నం
తెలంగాణలో సీఎం కేసీఆర్ తన కూతురు కవితను రాజ్యసభకు పంపాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేటీఆర్, ఢిల్లీలో కవితలు కీలక పాత్ర పోషిస్తారనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇక ఏపీలో కూడా ఇదే తరహా ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం . ఇక వైసీపీని పార్టీ పరంగా చూసుకుంటే దీర్ఘకాలంలో జగన్ తర్వాత నెంబర్ 2గా విజయ్ సాయిరెడ్డి మాత్రమే ఉన్నారు. అయితే షర్మిలాను ఢిల్లీకి ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆమెను పార్టీలో నెంబర్ టూగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది సమాచారం. అదే సమయంలో ఢిల్లీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం కొనసాగాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
రాజశేఖర్ రెడ్డి కూతురిగా షర్మిలా సక్సెస్ అవుతారానే భావన
2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి జగన్ వైయస్సార్ లెగసీని చాటాడు. ఢిల్లీకి షర్మిలాను ప్రమోట్ చేసి అక్కడ కూడా తన తండ్రి వారసత్వం కొనసాగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు షర్మిలాకు సబ్జెక్ట్పై మంచి పట్టు ఉండటం, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండటం కలిసొచ్చే అంశాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక కేంద్రం ఏదైనా బిల్లులు పాస్ చేయించాలంటే రాజ్యసభలో సరైన మద్దతు లేదు. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు జగన్ సహకారం కోరినట్లు సమాచారం. రాజ్యసభలో విజయ్ సాయిరెడ్డి మాత్రమే మాట్లాడుతుండటం, మిగితా సభ్యులు భాషా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో షర్మిలా ఆ లోటును భర్తీ చేయగలదనే విశ్వాసం వైసీపీ వర్గాల్లో బలంగా ఉంది. కేసీఆర్ పిల్లలుగా ఢిల్లీలో ఎలా అయితే కవిత సక్సెస్ అయ్యారో... రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలా సక్సెస్ అవుతారనే భావనలో జగన్ ఉన్నారు. అంతేకాదు అటు ఢిల్లీలో నెంబర్ వన్ పొజిషన్..ఇటు ఏపీలో నెంబర్ టూగా ఎదుగుతుందనే భావనలో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.
వైయస్సార్ మేనరిజంతో ఆకట్టుకున్న షర్మిలా
ఇక షర్మిలా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర తర్వాత ఇటు చంద్రబాబు, జగన్ పాదయాత్రల కంటే ముందే రాష్ట్రంలో పాదయాత్ర చేశారు షర్మిలా. జగన్ జైలులో ఉన్న సమయంలో తన అన్నకోసం పార్టీ కోసం పాదయాత్ర చేపట్టింది షర్మిలా. ఆ సమయంలో తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. పంచ్లతో క్యాడర్లో జోష్ను పెంచారు. ఇక ఎన్నికలు జరిగిన సందర్భంలో రాజశేఖర్ రెడ్డి ఆహార్యాన్ని, మేనరిజంను షర్మిలా ప్రదర్శించారు. జగన్ జైలులో ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపించడంలో కీరోల్ పోషించారు షర్మిలా. ఇప్పుడు వైసీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు మంచి అవకాశం ఉందని సీఎం జగన్ భావిస్తున్నారు. 22 మంది ఎంపీలు వైసీపీలో ఉన్నారు. అదే సమయంలో రాజ్యసభలో నాలుగు సీట్లు ప్రస్తుతం ఉన్న రెండు సీట్లు కలిపితే మొత్తం ఆరు సీట్లు అవుతాయి. ఇక్కడే వైసీపీకి మంచి అవకాశం ఉన్నట్లు జగన్ భావిస్తున్నారు. అటు కేంద్రంకు మద్దతుగా నిలిస్తే షర్మిలా ఫోకస్ అయ్యే అవకాశం ఉందని ఇటు పార్టీ వర్గాలు అటు సీఎం జగన్ భావిస్తున్నారు.
Recommended Video
షర్మిలాను ఒప్పించే ప్రయత్నం
కొన్ని నెలల క్రితం షర్మిలాపై వ్యక్తిగతంగా జరిగిన దుష్ప్రచారంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు షర్మిలాను మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి తీసుకొస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైసీపీ నేతలు జగన్కు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ విషయం తల్లి విజయమ్మతో కూడా డిస్కస్ చేసినట్లు సమాచారం. షర్మిలాను కన్విన్స్ చేయడమే తరువాయి అనే సంకేతాలు వస్తున్నాయి. షర్మిలా ఒప్పుకోవడమే మిగిలిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు అధికారంలోకి వచ్చాక షర్మిలాను జగన్ దూరం పెట్టారనే ప్రచారానికి కూడా కౌంటర్ ఇచ్చినట్లు అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి అధికారికంగా ఒక్క కనకమేడల మాత్రమే రాజ్యసభలో ఉన్నారు. షర్మిలాను ఫోకస్ చేసేందుకు ఇదే మంచి సమయం అవుతుందని జగన్ భావిస్తున్నారు. కరుణానిధి కుమార్తె కనిమొళి, కేసీఆర్ కుమార్తె కవిత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే లాంటి వారంతా ఫోకస్ అయ్యింది ఢిల్లీ నుంచే కావడం విశేషం. వీరి తరహాలోనే షర్మిలా కూడా సక్సెస్ అవుతారనే పూర్తి నమ్మకంతో సీఎం జగన్ ఉన్నట్లు వైసీపీలో వినిపిస్తోంది.