న్యూయార్క్ లో జగన్ వీడియో వైరల్: టైం స్క్వేర్ నుండి సీఎం భరోసా: ప్రవాసాంధ్రుల్లో హాట్ టాపిక్..!
కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యాలకు సైతం నిద్ర పట్టనివ్వడం లేదు. ఇప్పటికే అమెరికాలో మరణాల సంఖ్యతో పాటు కరోనావైరస్ పాజిటివ్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 3వేల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. ఇక 1.67000కు పైగా కేసులు నమోదయ్యాయి.
సోమవారం ఒక్కరోజున మాత్రమే 540 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే అమెరికాలో తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా ఇరుక్కుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యం చెబుతున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అక్కడి ఏపీ ప్రజలకు భరోసా ఇస్తోంది.
కరోనా ధాటికి చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాసాంధ్రులు తల్లడిల్లుతున్నారు. అక్కడ ఉన్న ప్రవాసాంధ్రుల్లో మనోధైర్యం నింపుతూ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో వీడియో సందేశం ఏర్పాటు చేశారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఏర్పాటు చేసిన ఈ వీడియో సందేశంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నారైలకు భరోసానిచ్చారు. " మీరు అక్కడ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండండి.. ఏపీలోని మీ కుటుంబసభ్యుల పట్ల మేం జాగ్రత్త వహిస్తాం" అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాను వీడియో సందేశం రూపంలో ఉంచారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టైమ్ స్క్వేర్లో ప్రజలకు మనోధైర్యాన్ని ఇచ్చే సందేశం ఏర్పాటు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. అమెరికాలో ఆర్థిక రాజధానిగా ఎదిగిన న్యూయార్క్లో ప్రస్తుతం కరోనా వీరవిజృంభణ చేస్తోంది. ప్రవాసాంధ్రుల్లో ఎక్కువ మంది ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే ఉంటారు. అక్కడ తమవారు ఎలా ఉన్నారో అన్న ఆందోళనలు ఇక్కడి వారిలో పెరుగుతున్న నేపథ్యంలో నేను విన్నాను, నేనున్నానన్న సందేశమివ్వడంపై ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేశారు.