చంద్రబాబు కోసమే తమ్మినేని ఎంపికా : పార్టీ ఓడినా ..ఆయన గెలవకూడదు: నేడు..అధ్యక్షా అనాల్సిందే..
తమ్మినేని సీతారాం. ఏపీ శాసనసభా కొత్త సభాపతి. ఏకగ్రీవంగా ఎన్నికైన నేత. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా..తొమ్మిదేళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఏరి కోరి తమ్మినేని సీతారాంను ఎంపిక చేసారు. దీనీకి అసలు కధ వేరే ఉంది. ఉత్తరాంధ్ర బీసీ వర్గానికి చెందిన తమ్మినేని ఎంపికలో సామాజిక సమీకరణాలతో పాటుగా అసలైన రాజకీయ సమీకరణమూ ఉంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ద్వారా తమ్మినేని సీతారాంను అధ్యక్షా అని పిలిపించాల్సిందే..ఎందుకంటే...
టీడీపీ ఆవిర్భావం నుండి తమ్మినేని
శ్రీకాకుళం జిల్లాలో ఎర్రంనాయడుతో పాటుగా తమ్మినేని టీడీపీ కీలక నాయకుడు. పార్టీ ఆవిర్భావం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా... తొమ్మది ఏళ్లు మంత్రిగా పని చేసారు. ఎన్టీఆర్తో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంలోనూ పని చేసిన అనుభ వం ఉంది. న్యాయ శాఖతో పాటుగా అనేక కీలక శాఖలను పర్యవేక్షించారు. అయినా..జిల్లాలో టీడీపీ అంతర్గత రాజకీయా ల కారణంగా తమ్మినేని అప్పటి వరకు పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజారాజ్యం ఆవిర్భావ సందర్భంలో పార్టీ మారాలని నిర్ణయించారు. ఎర్రంనాయుడుతో ఉన్న విబేదాల కారణంగా ఆయన కోసం పని చేయలేను..టీడీపీకి ద్రోహం చేయలేనని ప్రకటించి టీడీపీ వీడారు. ప్రజారాజ్యం నుండి 2009 ఎన్నికల్లో ఆముదాలవలస నుండి పోటీ చేసారు. ఆ సమయంలో తమ పార్టీని వీడి తమ్మినేని ప్రజారాజ్యంలో చేరటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు రుచించలేదు. అదే తమ్మినేనిని దెబ్బ తీయాలని నాడు నిర్ణయించారు.
తమ్మినేని మీద పోటీకి బామ్మర్ది..
తమ్మినేని ఎలాగైనా గెలవానికి వీళ్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలకు స్పష్టం చేసారు. పార్టీ ఓడినా పర్వాలేదు..ఆయన మాత్రం సభలో అడుగు పెట్టకూడదని సూచించారు. ఆ ఎన్నికల్లో సీతారాం మీద ఆయన బామ్మర్ది కూన రవికుమార్ను టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో సీతారం ఓడిపోయారు.ప్రజారాజ్యం నాడు కాంగ్రెస్లో విలీనం కావటంతో తమ్మినేని తిరిగి టీడీపీలో చేరినా గుర్తింపు లేదు. దీంతో..2013లో వైసీపీలో చేరినా ..మరోసారి తన బామ్మర్ది చేతిలో పరాజయం తప్పలేదు. నియోజకవర్గంలో ఆ ఓటమి ద్వారా తన వైఫల్యాలు ఎక్కడో గుర్తించారు. ఒక వైపు వైసీపీ అధినేతకు దగ్గరయ్యారు. మరో వైపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. దీంతో తాజా ఎన్నికల్లో ఆయన వైసీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఆరో సారి శాసనసభలో ప్రవేశించారు.
నేడు..అధ్యక్షా అనాల్సిందే..
ఇక, సామాజిక కోణంలో కళింగ వర్గానికి చెందిన ఉత్తరాంధ్ర బీసీ నేత తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించిన జగన్ ఎలాగైనా చంద్రబాబుకు ఇష్టం లేకపోయినా అధ్యక్షా అని పిలిచే పరిస్థితి కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం ఇదే రకంగా చంద్రబాబు ఎవరినైతే అసెంబ్లీలో చూడకూడదని భావించారో..దగ్గుబాటికి సైతం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో..ఇప్పుడు తమ్మినేని సీతారంను ఎంపిక చేసారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో ఖచ్చితంగా అధ్యక్షా అని పిలవక తప్పదు. మైకు ఇవ్వండ అని అడగక తప్పని పరిస్థితి. దీంతో..ఇప్పుడు ఏకగ్రీవంగా స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం పదవి స్వీకరించగానే ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.