సీఎం జగన్ ఏం చెప్పారు: తెలంగాణ జేఏసీకి మద్దతుగా ఏపీయస్ ఆర్టీసీ: ఏం చేయనున్నారు..!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్టీసీ మీద తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలంగాణలో సమస్య తెచ్చి పెట్టింది. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా కమిటీ ఏర్పాటు చేసారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకొని కార్మికులను మాత్రం ప్రజా రవాణా ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు.
ఇక, తెలంగాణలో 15 రోజులుగా ఆర్టీసీ సమ్మె సాగుతోంది. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో..ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్టీసీలో చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు ప్రకటించిన మద్దతు కొనసాగించాల వద్దా అనే మీమాసంలో యూనియన్లు ఉన్నాయి. ఇంతకీ సీఎం చెప్పిందేంటి..
నన్ను ఇబ్బంది పెడితే ఎలా..
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఏపీ ఆర్టీసీ సంఘాలు మద్దతు ప్రకటించాలని నిర్ణయించాయి. అందు కోసం కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నాయి. తొలి విడతలో మాత్రం ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని నిర్ణయించాయి. ఇదే సమయంలో ఒక ప్రముఖ కార్మిక సంఘ నేతలు ముఖ్యమంత్రి జగన్ ను కలిసారు. ఆ సమయంలో ఆర్టీసీలో కొత్త బస్సుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి తాను ఇప్పటి కే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని..నిధులు సైతం విడుదల చేయాలని చెప్పానని చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రస్తావనకు వచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ సంఘాలకు మద్దతుగా
ఏపీలో ఆర్టీసీ కార్మికుల కోసం చేయగలిగిన దాని కంటే ఎక్కువగా చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో తెలంగాణ ఆర్టీసీ సంఘాలకు మద్దతుగా మీరు ఆందోళనలకు నిర్ణయించటం సరి కాదు. నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి..అంటూ సూచించారు. దీంతో..ఆ కార్మిక సంఘాల నేతలు వెంటనే తాము చేయటం లేదని..మరో సంఘానికి చెందిన నేతలు ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నారని సమాధానం ఇచ్చారు. వారితోనూ మాట్లాడాలని.. మీకు ఇబ్బందులు లేకుండా నేను చూస్తాను..ప్రజలకు..ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పనులు చేయవద్దంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ కార్మికులకు మద్దతుగా నిలవాలని భావించిన మరో కార్మిక సంఘ నేతలు సైతం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఆర్టీసీకి వెయ్యి కోట్లు విడుదల..
ఆర్టీసీలో కొత్త బస్సుల కోసం ఏపీ ప్రభుత్వం వెయ్యి కోట్ల రుణానికి అనుమతి ఇచ్చింది. ఈ నిధులు ద్వారా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కాలం చెల్లిన బస్సులను తీసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అందులో భాగంగా సంస్థకు నిధులను సమీకరించుకొనేందుకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రస్తుతం వెయ్యి కోట్లు ఆర్టీసీకి సమకూరనున్నాయి. సంస్థలో ప్రస్తుతం 11,920 బస్సులు ఉండగా..21 వేల మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. కాగా..మొత్తం డ్రైవర్ల సంఖ్య 26,981 గా ఉంది. దీంతో..కొత్త బస్సులను తీసుకోవటం ద్వారా ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు..అన్ని రూట్లలో అందించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు సూచనలు చేసింది. ఇక, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె సమయంలో ఏపీ ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.