జగన్ టార్గెట్ 2024 కాదు..2022 : తొలి బడ్జెట్లో లక్ష్యం రెండు కోట్ల ఓటర్లు
Recommended Video
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించిన జగన్ మరోసారి తానే అధికారం దక్కిం చుకొనే దిశగా అడుగులు మొదలు పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత జరిగిన తొలి పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జగన్ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. టార్గెట్ 2024 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుండి కసరత్తు చేయాలని నిర్ధేశించారు. అయితే, ఇప్పుడు అది 2024 కాదు..జగన్ టార్గెట్ 2022. జమిలి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారు. దీని కోసం రాష్ట్ర అర్దిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే తన హామీల అమలుక ప్రాధాన్యత ఇస్తే ఏకంగా సంక్షేమ రంగానికి 75 వేల కోట్లు కేటాయించారు. దీని ద్వారా జగన్ లక్ష్యం చేసిన ఓటర్లు రెండు కోట్ల మంది...
జగన్ లక్ష్యం 2024 కాదు 2022..అందుకే
ముఖ్యమంత్రి జగన్ ఇక ఏమాత్రం ఏపీలో మరో పార్టీకి అధికారం ఇవ్వటానికి సిద్దంగా లేరు. దీని కోసం ఏ హామీలు అయితే తనకు రికార్డు స్థాయిలో అధికారం కట్టబెట్టారో అదే స్థాయిలో హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత అయిదేళ్ల కాలంలో హామీలను అమలు చేయాలని భావించారు. కానీ, గత నెలలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జమిలి ఎన్నికల మీద అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని జమిలి ఎన్నికల ప్రతిపాదన కు మద్దతు ప్రకటించారు. దీంతో.. 2024 తిరిగి ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. 2022లోనే సార్వత్రిక ఎన్నికలు జరిగే ఛాన్స్ బలంగా కనిపిస్తోంది. దీంతో..రాష్ట్ర ఆర్దిక పరిస్థితి అంతగా సహకరించకున్నా తొలి బడ్జెట్లోనే తన హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగా నవ రత్నాలకు భారీ కేటాయింపులు చేసారు. ఇక, ఇదే సమయంలో స్థానిక.. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ముందుగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని..ఇక జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయాలని నిర్ణయంచారు. తొలి బడ్జెట్లోనే జగన్ లక్ష్యం ఏంటనేది స్పష్టంగా కనిపించింది.
సంక్షేమ రంగానికే 75వేల కోట్లు..
జగన్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో రికార్డు స్థాయిలో సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేసారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి మొత్తంగా 75 వేల కోట్లు కేటాయించారు. అమ్మ ఒడి పధకానికి 6,455 కోట్లు కేటాయించారు. ఈ పధకం కింద లబ్దిదారుల సంఖ్య 43 లక్షలుగా తేల్చారు. సామాజిక పెన్షన్లు మొత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా 15,476 కోట్లు కేటాయించగా..దాదాపు 60 లక్షల మంది లబ్ది దారులు ప్రయోజనం పొందుతున్నారు. డ్వాక్రా మహిళల రుణాల ఎన్నికల వరకు బకాయి ఉన్న మొత్తం దాదాపు 8700 కోట్లు మాఫీ చేయనున్నారు. వీరి సంఖ్య కోటి వరకు ఉంది. ఇక, రైతాంగానికి మొత్తం 28,866 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. కౌలు రైతులతో కలుపుకుంటే మొత్తంగా 60 లక్షల మంది రైతులకు లబ్ది జరగనుంది. ఆరోగ్య శ్రీ అయిదు లక్షల వరకు పరిమితి పెంచటంతో లబ్ది దారులు భారీగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు.. అనేక వర్గాలకు కార్పోరేషన్ల ద్వారా రాజకీయంగా ఆ వర్గాల్లోనూ బలం పెంచుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు.
లక్ష్యంగా నిర్ణయించుకున్న ఓటర్లు రెండు కోట్ల మంది..
ఇక, తొలి బడ్జెట్లోనే 75 వేల కోట్ల సంక్షేమ రంగ కేటాయింపుల ద్వారా దాదాపు రెండు కోట్ల మంది లబ్దిదారులకు మేలు జరగనుంది. దీని ద్వారా వారంతా ప్రభుత్వానికి అండగా నిలుస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, గతంలో చంద్రబాబు ఎన్నికల ముందు..ఓటర్లుగా మాత్రమే వారిని దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో పసుపు - కుంకుమ, అన్నదాత సుఖీభవ పధకం అమలు చేసినా..తమను మభ్య పెడుతున్నారనే కారణంతో ఓటర్లు చంద్రాబుకు ఓట్లు వేయలేదని జగన్ అంతర్గత చర్చల్లో విశ్లేషిస్తున్నారు. దీంతో..ఈ ప్రభుత్వం అయిదేళ్లు ఉన్నా..జమిలి ఎన్నికల కారణంగా మూడున్నారేళ్లే ఉన్నా..తొలి నుండే చిత్తశుద్దితో ఇచ్చిన మాట మేరకు సంక్షేమ పధకాలు అందించామనే విశ్వసనీయత ద్వారా వచ్చే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ను పదిలం చేసుకోవటమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో..ఇక ఇప్పుడు ప్రతిపక్షం ఇందులో లోపాలను ఎత్తి చూపే పని ప్రారంభించింది.