ముహూర్తం ఫిక్స్.. ఆ ఇద్దరికే జగన్ కేబినెట్లో చోటు..?మోపిదేవి,పిల్లి రాజీనామాలు ఆమోదం
అమరావతి: ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసారు. తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎంపిక కావటంతో వారిద్దరి స్థానంలో తిరిగి బీసీ వర్గాలకే అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల తరువాత జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్ పూర్తిగా సామాజిక..ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా రూప కల్పన చేసారు. ఐదు వర్గాల నుండి ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
Recommended Video
ఇక, ఇప్పుడు ఖాళీ అయిన రెండు స్థానాలను తిరిగి అవే సామాజిక వర్గాలతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రులుగా మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు రాజీనామాలు చేయగా గవర్నర్ వాటిని ఆమోదించడం జరిగింది. ఈనెల 22న రాజ్యసభ సభ్యులుగా ఇద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కేబినెట్ విస్తరణ..ముహూర్తం ఖరారు..
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించని విధంగా అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని కేబినెట్ రూపకల్పన చేసారు. తన కేబినెట్ లో బీసీ..మైనార్టీ..ఎస్సీ..కాపు..ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉప ముఖ్య మంత్రి పదవులు ఇచ్చారు. ఇక, ఇప్పుడు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోసు, మోపిదేవి రాజ్యసభకు ఎంపికయ్యారు. తిరిగి వారి స్థానాల్లో అవకాశం కోసం అనేక మంది సీనియర్ నేతలు నిరీక్షిస్తున్నా రు. అయితే, వారు మరింతగా ఆశలు పెంచుకోకుండా రెండు స్థానాలూ బీసీలతోనే భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేసారు. ఇప్పుడు కొత్తగా ఇద్దరి మంత్రులతో ప్రమాణ స్వీకారానికే పరిమితం కావాలని..అందునా కరోనా సమయం కావటంతో నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందు కోసం శ్రావణ మాసం ఆరంభం అయిన రెండో రోజు అంటే ఈ నెల 22వ తేదీ మధ్నాహ్నం 1.29 గంటలకు ఏపీ కేబినెట్లోకి ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చంద్రబోస్ స్థానంలో చెల్లు బోయిన వేణుగోపాల్ కృష్ణ
పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణ స్థానాల్లో తిరిగి వారి సామాజిక వర్గాలకు చెందిన వారికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించగా..ఆ హోదా శ్రీకాకుళం నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన క్రిష్ణదాస్కు కేటాయించే అవకాశం ఉంది. ఇక, పిల్లి సుభాష్ చంద్ర బోసు స్థానాన్ని అదే జిల్లాకు చెందిన..అదే వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పిల్లి శెట్టి బలిజ వర్గానికి చెందిన వారు కాగా.. అదే జిల్లా.. అదే వర్గానికి చెందిన వేణుకు ఇప్పుడు ఆ సమీకరణాలు కలిసి వచ్చాయి.
మోపిదేవి స్థానంలో సిదిరి అప్పలరాజు
ఇక, రెండో స్థానం కోసం మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో ఆయన సొంత జిల్లా అయిన గుంటూరు నుండి జంగా క్రిష్ణమూర్తి ఆశలు పెట్టుకున్నారు. అయితే, మత్స్యకార వర్గంతోనే మోపిదేవి స్థానం భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో..ఎమ్మెల్యేగా పోటీ చేసి 2014లో ఓడినా..2019 లో శ్రీకాకుళం జిల్లా పలాస నుండి గెలిచిన డాక్టర్ సిదిరి అప్పలరాజు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ముఖ్యమంత్రి ఆయనను తన కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలాసాలో సిదిరి అప్పలరాజును అభినందిస్తూ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. జగన్ కేబినెట్లో అప్పలరాజు, వేణుగోపాల కృష్ణ చోటు దక్కుతుందని భావిస్తున్న వీరిద్దరూ కూడా తొలి సారి ఎమ్మెల్యేలే కావటం విశేషం.చివరి నిమిషంలో మార్పులు..చేర్పులు జరిగితే మినహా..ఈ ఇద్దరే మంత్రులుగా జగన్ కేబినెట్ లో ఎంట్రీ ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లుగా మంత్రుల శాఖల్లోనూ మార్పు ఉండదని తెలుస్తోంది.
మొత్తానికి ఖాళీ అయిన రెండు స్థానాలను తిరిగి అవే సామాజిక వర్గాలతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం 22వ తేదీ మధ్నాహ్నం 1.29 గంటలకు ముహూర్తంగా ఖరారు చేసారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించే వారి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ,ఆ ఇద్దరి పేర్లు అనధికారికంగా ఇప్పటికే ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, తొలి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆ ఇద్దరికీ జగన్ ఇప్పుడు అవకాశం ఇవ్వటం చర్చకు కారణమవుతోంది.