ఏపీ కేబినెట్ తొలి మీటింగ్ రేపే.. మహిళలు , ఉద్యోగులు , రైతులే ప్రధాన అజెండా!
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసిన సీఎం జగన్ సోమవారం తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన ఆయన.. వాటికి మంత్రివర్గం ఆమోదం తీసుకోనున్నారు. రేపు జరగనున్న భేటీలో ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
అందరి దృష్టి మద్యపాన నిషేదం పైనే..! హామీ అమలు పట్ల సీఎం జగన్ తర్జన బర్జన..!!
మహిళలు, రైతులు, ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి
సీఎం జగన్ నేతృత్వంలో జరగనున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో రైతులు, మహిళలు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలే ప్రధాన అజెండా ఉన్నట్లు సమాచారం. సచివాలయం మొదటి బ్లాకులోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 10.30గంటలకు భేటీ ప్రారంభంకానుంది. ఖరీఫ్లో తీసుకోవాల్సిన చర్యలు, ఆశావర్కర్ల వేతనాల పెంపు, ఉద్యోగులకు ఐఆర్ తదితర నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. తిత్లీ, ఫొని తుఫాను బాధితులకు పరిహారం, కేంద్రం నుంచి అందిన ఆర్థికసాయం తదతర అంశాలు కేబినెట్ మీటింగ్లో ప్రస్తావనకు రానున్నాయి.
హామీల అమలుపై దృష్టి
ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదాలకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువుల లభ్యత, పంటకు మద్దతు ధర తదితర అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆశావర్కర్ల వేతనాలు రూ.3 వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ ఫైలుపై తొలి సంతకం చేసిన జగన్ ఆ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేయించుకోనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం కారణఁగా రాష్ట్రంలో 42వేల మంది ఆశావర్కర్లు లబ్దిపొందనున్నారు.
ఉద్యోగులకు 27శాతం ఐఆర్
ఎన్నికల ప్రచారంలో జగన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 27 శాతం మధ్యంతర భృతికి కేబినెట్ ఓకే చెప్పే అవకాశముంది. ఐఆర్ పెంపుతో ఏపీ ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.2,415కోట్ల అదనపు భారం పడనుంది. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుపై గత ప్రభుత్వం టక్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. కమిటీ సిఫార్సులపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
హోం గార్డులకు గుడ్ న్యూస్?
ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కేబినెట్ ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. పెన్షన్ మొత్తం రూ.2250కు పెంపు అంశంతో పాటు హోం గార్డులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. హోం తెలంగాణలో హోం గార్డులకు ఇస్తున్న వేతనం కన్నా వెయ్యి అదనంగా ఏపీలో ఇస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కేబినెట్ నిర్ణయం మేరకు సీఎం ఆ మాట నిలబెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రాష్ట్రవ్యాప్తంగా 16,616 మంది హోంగార్డులకు ప్రయోజనం చేకూరనుంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పారిశుద్య కార్మికుల వేతనాల పెంపు, రైతు భరోసా కింద అన్నదాతలకు చెల్లించనున్న రూ.12,500 ఆర్థిక సాయం తదితర అంశాలపైనా ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గం ఆమోదం తీసుకునే అవకాశముంది.