నెటిజన్లతో పాటు తెలుగు ప్రజలను తొలుస్తున్న ప్రశ్న..! జగన్ కాళేశ్వరానికి వెళ్తారా..?
అమరావతి/హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టి మరోసారి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ పర్యటన మీద కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి హాజరౌతారా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిరసనగా గతంలో కర్నూలులో జగన్ మూడు రోజులు పాటు జలదీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఆ సందర్బంగా అదే ప్రాజెక్టు నిర్మాణం పై జగన్ అనుచిత వ్యాఖ్యలు కూడా చేసారు. ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం నిర్మించడం జగన్ మోహన్ రెడ్డికి రుచించని అంశంగా పరిణమించింది. తాజాగా ఇప్పుడు అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే జగన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తారా అనే అంశంపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సర్వత్రా ఉత్కంఠ..! సీఎం హోదాలో జగన్ కాళేశ్వరానికి వస్తారా..?
తెలంగాణ రాష్ట్రానికి వరదాయినిగా భావిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించడానికి వీలుగా.. గరిష్టంగా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించారు. ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ సీఎం అధికారులను ఆదేశించారు. ఏడాదికి 540 నుంచి 600 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసి..తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే కేసీఆర్ స్వప్నం సాకారం కాబోతోంది. నీటిని లిఫ్ట్ చేయడానికి భారీగా విద్యుత్ అవసరమైనా..ఏ మాత్రం వెనకడుగు వేయొద్దని ఆయన ఇప్పటికే అధికారులకు సూచించారు. జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తో పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్లను చంద్రశేఖర్ రావు ఆహ్వానిస్తున్నారు.
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులు..! ఎపి సీయం పై ప్రత్యేక దృష్టి..!!
ఇప్పటికే ముంబై వెళ్లి ఫడ్నవీస్ను ఆహ్వానించిన చంద్రశేఖర్ రావు .. జూన్ 17న అమరావతి వెళ్లి జగన్ను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి పేచీలు పెట్టకుండా సహకరించినందున ఫడ్నవీస్ను, సాటి తెలుగు రాష్ట్ర సీఎం అయిన జగన్ను చంద్రశేఖర్ రావు చీఫ్ గెస్టులుగా పిలుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోణంలో చూస్తే..ఏపీ సీఎం జగన్ ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి జగన్ మొగ్గు చూపుతున్నారు.
కాళేశ్వరానికి వ్యతిరేకంగా గతంలో జగన్ జలదీక్ష..! ప్రారంభోత్సవానికి హాజరౌతారా..!!
అందులో భాగంగా హైదరాబాద్లోని ఏపీ భవనాలను తెలంగాణకు కేటాయించి చొరవ చూపారు. చంద్రశేఖర్ రావు కూడా సమస్యలను పరిష్కరించుకోవాలని, అనవసర రాద్దాంతాలేవీ వద్దనే భావనతో ఉన్నారు. కానీ ఏపీకి చెందిన కొందరు మాత్రం ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. 2016లో కాళేశ్వం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వ్యతిరేకంగా జగన్ మూడు రోజులపాటు కర్నూలులో జలదీక్ష చేపట్టారని, 2019లో అదే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
గతంలో టీ సర్కార్ పై జగన్ అనేచిత వ్యాఖ్యలు..! వైరల్ అవుతున్న వీడియోలు..!!
భుపాలపల్లి థర్మల్ ప్రాజెక్ట్తో కలిపి గోదావరి జలాల ట్రిబ్యూనల్ గతంలో ఏపీకి 1480 టీఎంసీలను కేటాయించింది. ఇందులో తమ భాగం 954 టీఎంసీలు, మిగతా 530 టీఎంసీలు మీవని చంద్రశేఖర్ రావు అంటున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ను ఎవడబ్బ సొత్తప్పా ఇది అని అడుగుతున్నా..? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతున్నారు. వాటికి అనుగుణంగా లెక్కలు కడుతున్న చంద్రశేఖర్ రావు తీరు ధర్మమేనా..? ఇరు రాష్ట్రాల నీటి వాటా ఎంత అనేది కృష్ణా, గోదావరి నదుల్లో తేలలేదు. కేవలం మీది ఎగువ రాష్ట్రం కాబట్టి.. మీ అవసరాలు తీరాకే మాకు నీళ్లు పంపిస్తామని హిట్లర్లా మాట్లాడటం చంద్రశేఖర్ రావు కు భావ్యం కాదు. చంద్రశేఖర్ రావు కు జ్ఞానోదయం కావాలి, చంద్రబాబు జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాఅని జగన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.