సీఎం జగన్ అమరావతిని చంపేయాలని చూస్తున్నారు, ‘పిచ్చి కుక్క’ కథ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లోని అన్నీ ప్రాంతాలకు అనువైన ప్రాంతం రాజధానిగా ఉండాలని అమరావతిని ఎంపికచేశామని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాలకు అమరావతి అందుబాటులో ఉంటుందని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని, అమరావతిని రాజధాని చేయాలని ప్రతిపాదన చేసిందని చెప్పారు. బుధవారం మందడంలో దీక్ష చేస్తున్న రైతులనుద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. దీక్షకు చంద్రబాబు సతీమణి భువనశ్వేరి కూడా సంఘీభావం తెలిపారు.
డబ్బులు లేవట..
రాజధాని నిర్మించాలంటే డబ్బులు లేవని సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే సమయంలో రూ. 16 వేల లోటు బడ్జెట్తో ఉందని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని నిర్మాణం కోసం అమరావతిని ఎంపికచేశామని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ అమరాతితోపాటు దొమకొండ, విశాఖపట్టణాన్ని కూడా పరిగణలోకి తీసుకుందని చెప్పారు.
దొమకొండకు 100 ఓట్లే
వైసీపీ అధినేత జగన్ సిఫారసు చేసిన దొమకొండకు 100 ఓట్ల వచ్చాయన్నారు. విశాఖపట్టణానికి 500 ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. కమిటీలో అమరావతిపై అన్నీ పార్టీలు, ప్రజాసంఘాలు నిర్ణయం తీసుకున్నాయని.. అప్పుడు అంగీకరించిన జగన్.. ఇప్పుడు జగన్ మాటా మారుస్తున్నారని తెలిపారు. ఆయన యూ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటీ అని చంద్రబాబు ప్రశ్నించారు.
చంద్రబాబు కథ..
అమరావతి రాజధాని మార్పు గురించి చంద్రబాబు నాయుడు ఓ పిచ్చికుక్క కథ చెప్పారు. గ్రామంలో పిచ్చికుక్క వచ్చిందని చెబితే.. అదీ నిజమా, అబద్దమా అని కూడా నిర్ధారించుకోకుండా.. దానిని చంపేస్తారని చెప్పారు. జనం తిరగబడి మరీ కుక్కను చంపేస్తారని.. తర్వాత అదీ పిచ్చి కుక్క అని నిర్ధారణ కూడా చేయరని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అమరావతి రాజధానిని చంపేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదీ మంచి పద్ధతి కాదని చంద్రబాబు మండిపడ్డారు.
ఎంక్వైరీ చేయండి
అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అంటున్నారు. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. సైబరాబాద్లో ఆనాడు హైటెక్ సిటీ నిర్మించడంతో భూమి విలువ ఆమాంతం పెరిగిందని గుర్తుచేశారు. ఎకరా లక్ష ఉన్న భూమి ధర ఆరు నుంచి ఏడేళ్లలో రూ.30 కోట్ల కు చేరిందని చెప్పారు.
రైతులకు ఆదాయం..
అమరావతి రాజధానిలో కూడా భూమి విలువ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చినా రైతులకు కనీస ఆదాయం ఇస్తున్నామని చెప్పారు. అక్కడి రైతులకు ఫించన్లు కూడా ఇస్తున్నామని.. దానిని ఏడాదికి పెంచుతూ వారి మేలు కోసం ప్రయత్నించామని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్య ఇదీ అని పేర్కొన్నారు.