ప్రధానికి సీఎం జగన్ లేఖ: శ్రీలక్ష్మిని నో అన్నారు..మరి ఈ ఐఏఎస్ అధికారికైనా: వారికి ఆశాభంగమేనా..!
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీకాలం ముగియనుంది. ఆ స్థానంలో కొత్తగా ఎవరే చర్చ ప్రభుత్వంలో మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఒక సీనియర్ అధికారి వైపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న సీఎస్ నీలం సాహ్నిని కొనసాగించాలని లేఖలో అభ్యర్థించారు. అయితే కొంతమంది అధికారుల విషయంలో ముఖ్యమంత్రి విజ్ఞప్తులను పక్కన పెట్టిన కేంద్రం సీఎం తాజా విజ్ఞప్తిపై ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది ప్రభుత్వ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.
జగన్ కోరిందే ప్రధాని చేశారా..? ఏపీకి కొత్త ఊరట..మారుతున్న రాజకీయ సమీకరణాలు
నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై జగన్ ఇంట్రెస్ట్
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని వచ్చే నెల 30న పదవీవిరమణ చేయనున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎస్గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను సడెన్గా బదిలీ చేసి ఆ స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని నియమించారు. కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి నిర్ణయాలపై సీఎస్ విబేధించినట్లు ప్రచారం సాగింది.
కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాలు తరలింపు, ఎన్నికల కమిషనర్ ఆర్డినెన్స్ వంటి విషయాల్లో అయిష్టంగానే సీఎస్ ఆదేశాలను అమలు చేశారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం ఉంది. కానీ కీలక నిర్ణయాల విషయంలో ప్రత్యేకించి కరోనా విపత్తు సమయంలో నీలం సాహ్ని పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తితో ఉన్నారు. దీంతో నీలం సాహ్నిని మరో మూడు నెలల పాటు సీఎస్గా కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ
ఇందుకోసం నేరుగా ప్రధాని మోడీకి సీఎస్ కొనసాగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. గతంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రలను డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్తో సహా ప్రభుత్వంలోని పెద్దలు కేంద్రం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కానీ కేంద్రం సమ్మతించలేదు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కనబెట్టిన కొందరు అధికారులకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ డీఓపీటీలకు కాకుండా నేరుగా ప్రధాని ద్వారానే అనుమతి పొందాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో భాగంగానే సీఎస్ కొనసాగింపు విషయంపై నేరుగా ప్రధానికి విన్నవించినట్లు తెలుస్తోంది.
ఆసక్తి కరంగా మారనున్న ప్రధాని నిర్ణయం
ఇక నీలం సాహ్ని తర్వాత సీఎస్ అయ్యేందుకు పలువురు అధికారులు పోటీపడుతున్నారు. అందులో సీనియర్గా ఉన్న సతీష్ చంద్ర తొలిస్థానంలో ఉన్నా ఆయనకు ఛాన్స్ లేనట్లుగానే కనిపిస్తోంది. నీరబ్ కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్లు రేసులో ఉన్నారు. అందులో జగన్ కేసుల్లో గతంలో విచారణ ఎదుర్కొన్న ఆదిత్యనాథ్ దాస్కు సీఎస్ హోదా దక్కుతుందని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో వీరికి ఆశాభంగం తప్పేలా లేదు. సీఎం జగన్ అభ్యర్థనను ప్రధాని మన్నిస్తే మరో మూడు నెలలపాటు నీలం సాహ్ని సీఎస్గా కొనసాగనున్నారు. గతంలో సీఎస్ల విషయంలో సైతం కేంద్రం అనుమతులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకి మాధవరావు, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రమాకాంత్ రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో పీకే మొహంతిల సర్వీసులను పొడిగించేందుకు గతంలో కేంద్రం అనుమతించింది. మరిప్పుడు ముఖ్యమంత్రి కోరడంతో ప్రధాని ఏరకంగా నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.