పంతం వీడింది.!ఆ అంశం పక్కకు వెళ్లింది.! మంత్రి వర్గ భేటీలో సీఎం జగన్ ప్రస్తావనే అందుకు నిదర్శనం.!
అమరావతి/హైదరాబాద్ : చెప్తే వినక పోతే చెడిపోయి కనపడతారనే సామెత ప్రకారం ఏపి రాజకీయాలు ముందుకెళ్తున్నాయి. ఏదైనా అంశం గురించి కొన్ని రోజులు పట్టుదలగా ఉంటాం తప్పితే, ఎల్ల కాలం అదే అంశాన్ని బుజాన వేసుకుని తిరగలేం. ఏపి రాజకీయ పరిస్థితులు అచ్చం ఇలాగే మారిపోయినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు ఏపి ఎన్నికల ప్రధాన కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ చుటూ తిరిగిన రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేపింది. ఆ వ్యవహారం న్యాయస్థానాలకు వరకు వెళ్లడం, ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. సరిగ్గా ఈ నేపథ్యంలో జరిగిన మంత్రి వర్గ భేటీలో ఓ మంత్రి ఇందుకు సంబంధించి ప్రస్తావించగా అందుకు సీఎం జగన్ ఊహించని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్యర్యారికి గురి చేసినట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గ భేటీలో ఏసి సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. విస్మయాన్ని వ్యక్తం చేసిన మంత్రులు..
ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా తనదైన మార్క్ ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా..లేదా అన్నదే ముఖ్యం అన్న చందంగా దూసుకెళ్తున్నారు. ఇలాంటి జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓ సంఘటన సడెన్ బ్రేకులు వేసేలా చేసిందనే చర్చ జరుగుతోంది. పట్టుపడితే సాధించే వరకు విశ్రమించని విక్రమార్కుడికి ఉన్న పేరును జగన్ మరిపిస్తున్న తరుణంలో ఏపీలో ఇటీవల జరిగిన పరిణామం పట్ల అంత తేలిగ్గా స్పందించినందుకు తోటి మంత్రులు మంత్రి వర్గ సమావేశం సందర్బంగా విస్మయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
జగన్ నోటివెంట ఆ మాటలా.. అస్సలు ఊహించలేమంటున్న మంత్రుల బృందం..
తాను తీసుకునే నిర్ణయాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత స్పష్టతతో ఉంటారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఒకసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే విననంత పట్టుదలగా ముందుకు వెళ్లే వ్యక్తిగా ముద్రవేసుకున్నారు జగన్. దీనికి తగ్గట్టే ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేందుకు అంత తొందరగా సుముఖత చూపండం జగన్ డిక్షనరీలో ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుత రోజుల మాదిరి కరోనా వైరస్ వ్యాప్తి చెందని రోజుల్లో స్థానిక ఎన్నికల్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో సీఎం జగన్ పట్టుదలను చూపించే వారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాకుండా తన నిర్ణయాన్ని కాదన్న వాడు తన రాష్ట్రంలో పని చేయాల్సిన అవసరం లేదన్నంతగా వ్యవహరించారు ఏపి సీఎం.
తారా స్థాయిలో చేసిన పోరాటం... ఒక్క మాటతో పక్కన పడ్డట్టైంది..
స్థానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేసే విషయంలో నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా ఆయన్ని పదవినుండి తొలగించేందుకు ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారో కూడా తెలిసిందే. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల అంశంపై ఏదో రకంగా తన పంతాన్ని నెగ్గించుకోవాలన్నట్లుగా సీఎం జగన్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణ మీద తన స్టాండ్ ను మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా గురువారం జరిగిన ఏపీ మంత్రి మండలిలో జగన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video
స్థానిక ఎన్నికల ప్రస్తావన ఇప్పుడొద్దు.. తర్వాత మాట్లాడుకుందాం అన్న ఏపి సీఎం..
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో దాదాపు ముప్ఫై ఒక్క అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చ సాగిన సమయంలోనే స్థానిక ఎన్నికల అంశం చర్చల మధ్యలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, కోర్టులో కేసు నడుస్తోంది కదా, తుది తీర్పు వచ్చాక దాని గురించి చూద్దామని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒక మంత్రి తీసుకొచ్చిన ప్రస్తావనను, ఒక్క మాటలో ఏపీ సీఎం జగన్ తేల్చేయటం మంత్రి వర్గంలో పాల్గొన్న అందరిని విస్మయానికి గురిచేసినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా కరోనా వైరస్ మీద కంటే ఎక్కువగా పోరాటం చేసింది సింపుల్ గా ఒదిలేయడానికేనా అనే చర్చ మంత్రుల్లో చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ అంశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి థృక్పదం మారిపోయిందనే చర్చ కూడా జరుగుతోంది.