జగన్తో కేసీఆర్ భేటీ: నాడు జగన్ పిలుపు..నేడు కేసీఆర్ ఆహ్వానం : వారిద్దరి మధ్య ఇదే చర్చ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపి పర్యటనకు వచ్చారు. ఆయనకు గన్నవరం విమనాశ్రయంలో ఏపీ మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆయన కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్లి పూజలు చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ ఆహ్వాన పత్రికకు పూజ చేయించారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్...కేటీఆర్ బృందాలనికి జగన్ స్వాగతం పలికారు. జగన్ వారికి విందు ఏర్పాటు చేసారు. ఇద్దరు ముఖ్యమంత్రి విభజన చట్టం పెండింగ్ సమస్యల పైన చర్చిస్తున్నారు.
నాడు ఆహ్వానించిన జగన్...
ఎన్నికల ముందు జగన్ ప్రస్తుతం ఉంటున్న నివాసాని గృహప్రవేశం చేసారు. అదే సమయంలో కేటీఆర్ సైతం కేసీఆర్ ప్రతినిధిగా హైదరాబాద్లో జగన్తో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిపారు. తదుపరి చర్చల కోసం కేసీఆర్ను తన ఇంటి గృహప్రవేశానికి తాడేపల్లికి రావాలని జగన్ ఆహ్వానించారు. అయితే, రాజకీయంగా వాతావరణం వేడెక్కటంతో కేసీఆర్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక, ఇప్పుడు నాటి ఆహ్వానం మేరకు జగన్ నివాసానికి విచ్చేసిన కేసీఆర్..కేటీఆర్ బృందానికి జగన్ విందు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తాను నిర్వహించబోయే కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. ఈనెల 21న కేసీఆర్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని జగన్ను కోరారు. ఇప్పటికే ఇదే కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కేసీఆర్ ఆహ్వానించారు.
విభజన సమస్యల పైన చర్చ..
తన నివాసానికి వచ్చిన కేసీఆర్తో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందుగా నిర్ణయించిన విధంగానే విభజన హామీల పెండింగ్ అంశాల మీద చర్చించారు. ప్రధానంగా 9, 10వ షెడ్యూల్ ప్రకారం సంస్థల విభజన గురించి ఇద్దరు సీఎంలు చర్చించినట్లు సమాచారం. అదే విధంగా విద్యుత్ పంపకాల సమస్యలు..ఉద్యోగుల విభజన మీద చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నీతి అయోగ్లో జగన్ ప్రసంగం..ఏపీకీ ప్రత్యేక హోదా అంశం పైనా లంచ్ సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నట్లు సమాచారం. అంతకు ముందు తన నివాసానికి వచ్చిన కేసీఆర్కు ఏపీ సీఎం జగన్ ఆయన కారు వద్దకు వెళ్లి స్వాగతం పలికారు ఆయనకు పుష్ప గుచ్చం..శాలువా ఇచ్చి స్వాగతించారు. సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు స్వరూపానంద సరస్వతి నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్లొంటారు.
దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్..
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్లి కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. సీఎం ఆలయానికి చేరుకోగానే అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్ తదితరులు ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆహ్వాన పత్రికకు ప్రత్యేక పూజలు చేశారు.