శ్రీవారి సేవలో నారా భువనేశ్వరి: సంక్రాంతికి సొంత ఊరిలో చంద్రబాబు
అమరావతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు దగ్గరుండి మరీ ఆమెకు దర్శనాన్ని చేయించారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కూడా సతీసమేతంగా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.
కాగా సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను సీఎం చంద్రబాబు తన సొంతూరు నారావారి పల్లెలో జరుపుకోనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు.
గురువారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు వెళ్తారు. చంద్రబాబు కుటుంబంతో పాటు, నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం విశేషం. ఇందులో భాగంగా గురువారం ఉదయమే నారా, నందమూరి కుటుంబ సభ్యులు నారావారి పల్లెకు చేరుకోనున్నారు.
ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం వరకు నారావారిపల్లెలోనే ఉంటారు. ఆ తర్వాత బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. కాగా నారావారి పల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు.
17వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి కర్ణాటకలోని ఉడిపికి వెళ్తారు. అక్కడి నుంచి 18వ తేదీ ఉదయం బయలుదేరి విజయవాడకు తిరిగివస్తారు.