కుప్పం నడిబొడ్డున సై: చంద్రబాబుకు జగన్ సవాల్: ముహూర్తం ఫిక్స్..!!
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ స్థానంలో విజయం సాధించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఇక మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కుప్పంలో పర్యటించనున్నారు.
కుప్పం కోసం కసరత్తు..
2024 ఎన్నికల్లో కుప్పం పార్టీ ఇన్ఛార్జ్ భరత్ కుమార్ విజయం సాధిస్తే- ఆయనకు మంత్రి పదవి సైతం ఇస్తానని వైఎస్ జగన్ హామీ కుప్పం పార్టీ కార్యకర్తలకు మాటిచ్చారు. భరత్ కుమార్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనీ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిని క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర- ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతం చేయాల్సి ఉంటుందనీ అన్నారు. గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్నామని, అసెంబ్లీ స్థానాన్ని ఎందుకు గెలవలేమనీ చెప్పారు.
అభివృద్ధి కోసం..
కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటోన్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తోన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలను ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను కేటాయించారు. ఇదివరకు గ్రామ పంచాయతీగా ఉన్న కుప్పానికి మున్సిపాలిటీ హోదా ఇచ్చింది జగన్ ప్రభుత్వమే.
కుప్పం పర్యటనకూ
ఇక కుప్పం పర్యటనకు వైఎస్ జగన్ పూనుకున్నారు. త్వరలోనే ఆయన ఆ నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో స్వయంగా పాల్గొననున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. సచివాలయాలను కూడా సందర్శించే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గ పరిధిలోని వలంటీర్లు, గ్రామ/సచివాలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమౌతారనీ చెబుతున్నారు.
Recommended Video
తొలి అడుగు అక్కడి నుంచే..
కుప్పం నుంచే తన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ జగన్. ఒక్కో నెల అయిదారు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల పర్యటనను 3-4 నెలల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ జిల్లాల పర్యటనను కుప్పం నుంచే ఆరంభించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇకపై ఎలాంటి రాజకీయపరమైన కార్యక్రమాలనైనా కుప్పం నుంచే మొదలు పెట్టేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.