మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. వీరి మధ్య మద్య నిషేధంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఒక్కో మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. చివరికి క్రమ క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. మహిళా మంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.
ఒక్కరి ఒక్కటే
కస్టమర్లు రిటైల్ షాపుల్లోకి రావడం తగ్గించాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఒక్కో కస్టమర్కు ఒక్క బాటిల్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. అలా అయితే మద్యపాన నిషేధం దిశగా క్రమంగా అడుగులు పడతాయని చెప్పారు. అయితే ఇలా చేయడం వల్ల మరిన్ని కష్టాలు వస్తాయని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
దశలవారీగా పక్కా అమలు..
దశలవారీగా మద్యపానం నిషేధం విధిస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. ఓ మంత్రి కల్పించుకొని ఒకేసారి సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని సూచించారు. మద్యాన్ని కంట్రోల్ చేస్తే పర్యాటక రంగ దెబ్బతింటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అవంతి సందేహంపై జగన్ నిక్కచ్చిగా సమాధానం చెప్పారు. తమకు టూరిజం ముఖ్యం కాదని, సమాజం కోసం ఆలోచించాలని హితవు పలికారు.
పెరిగిన ధరలు
మరికొందరు మంత్రులు కల్పించుకొని మద్యం ధరలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఫరావాలేదని, కస్టమర్లు మందు తాగడం తగ్గిస్తారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. మద్యం విక్రయాలను బట్టి అవసరమైతే ఇంకా మద్యం ధరలు పెంచుతామని జగన్ సంకేతాలు ఇచ్చారు. తర్వాత మహిళా మంత్రులను మద్యం కంట్రోల్ చేయలా వద్ద అని అడిగారు. వారు మద్యాన్ని నియంత్రించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
భిన్నాభిప్రాయాలు...
మద్యపాన నిషేధం అమలు చేస్తామని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఆయన మంత్రివర్గంలోని సభ్యులు సైతం మద్యపాన నిషేధంపై భిన్న స్వరాలు వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత ఆమాత్యులతో జగన్ జనరల్ డిస్కషన్ చేసినా.. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటారనే వాదనలకు బలం చేకూరుస్తోంది.