నివర్ తుపాను ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే- చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో..
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీవర్షాలు, ఈదురుగాలులకు ఈ మూడు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికీ ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
Recommended Video
చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం జగన్ ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడ పలువురు రాష్టమంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం జగన్కు స్వాగతం పలికారు. సీఎం జగన్ అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరిన సీఎం జగన్ నెల్లూరు, కడప జిల్లాల్లోనూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సర్వే అనంతరం సీఎం జగన్ అధికారులతో పంటనష్టం, ఆస్తినష్టాలపై చర్చించారు. తాజా పరిస్ధితిపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సీఎం జగన్ పరిశీలించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తినష్టం, పంటనష్టం అంచనాలను పూర్తి చేసి డిసెంబర్ చివరిలోగా బాధితులకు పరిహారం అందించాలని నిన్న కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలను కేంద్రానికి కూడా పంపనున్నారు.