తీవ్రంగా స్పందించిన జగన్: ఉప ముఖ్యమంత్రికి ఫోన్కాల్: ఆ ఘటనపై ఆరా: సమగ్ర నివేదిక కోసం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 40 మందికి పైగా స్థానికులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.. ఆరా తీస్తున్నారు. వైద్య మంత్రిత్వశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై ఓ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయాలని సూచించారు.
ఏలూరులోని పడమర వీధి, కొత్త వీధి, దక్షిణ వీధిలో నివసించే వారు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తొలుత 25 మంది అనారోగ్యానికి గురయ్యారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతూ పోయింది. రాత్రి నాటికి 40 మందికిపైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. నురగలు కక్కుకూంటూ ఉన్నట్టుండి నేలకు వాలిపోయారు. అస్వస్థతకు గురైనవారిలో 15 మందికి పైగా చిన్నపిల్లలు ఉండటం కలకలం రేపింది. వారందరినీ హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు.
ఈ సమాచారం అందిన వెంటనే ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆసుపత్రికి వెళ్లారు. బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్లర్లను ఆదేశించారు. డాక్టర్లు వారి రక్త నమూనాలను సేకరించి విజయవాడ ఆసుపత్రికి పంపించారు. బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదంటూ వార్తలొచ్చాయి. హఠాత్తుగా వారంతా అనారోగ్యానికి గురి కావడానికి నీటి కాలుష్యమే కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రక్త నమూనాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడైన తరువాతే.. ఖచ్చితమైన కారణం తెలుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.
Recommended Video
అనారోగ్యానికి గల కారణాలను ఆరా తీయడంలో భాగంగా జిల్లా వైద్యాధికారులు ఆ మూడు వీధుల్లో ఇంటింటి సర్వే చేపట్టారు. వారు వినియోగించిన నీటి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ లాబొరేటరీకి పంపించారు. ఈ ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఒకేసారి 40 మందికి పైగా అనారోగ్యానికి గురి కావడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం ఆయన ఆళ్ల నానికి ఫోన్ చేశారు. కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆళ్ల నాని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని జగన్ చెప్పారు. దీనికి గల కారణాలపై నివేదికను అందజేయాలని సూచించారు.