మహిళల రక్షణ కోసం అభయం యాప్ ప్రారంభించిన సీఎం జగన్ .. ఆటోలు, క్యాబ్స్ లో డివైజ్ల ఏర్పాటు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. వర్చువల్ విధానంలో ఈ యాప్ ను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రవాణా శాఖ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు అమలు అవుతుందని, మహిళల భద్రత కోసమే అభయం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: స్టేట్ రోడ్ ఫీజ్ బాదుడుకు రంగం సిద్ధం
మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తున్నామన్న సీఎం జగన్
ఇప్పటి వరకు రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళా రక్షణకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని, ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇక నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పిన సీఎం జగన్, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ వంటి కీలక పదవులలోనూ మహిళలకు స్థానం కల్పించామని పేర్కొన్నారు.
ఆటోలు, క్యాబ్ లలో నిర్భయంగా ప్రయాణించడం కోసం అభయం యాప్
మహిళల రక్షణ కోసం మిగతా రాష్ట్రాల కంటే ఒక్క అడుగు ముందుకు వేసి దిశా బిల్లు ప్రవేశపెట్టామని పేర్కొన్న సీఎం జగన్ మహిళలకు ఆర్థిక , రాజకీయ స్వావలంబన కలిగించడానికి, వారికి రక్షణ కల్పించడానికి రాజీ లేకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఆటోలు, క్యాబ్ లలో నిర్భయంగా ప్రయాణించడం కోసం ఈ అభయం యాప్ ను అందుబాటులోకి తెచ్చామని, ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఆటో లోనూ , క్యాబ్ లోనూ ఈ యాప్ తో కనెక్ట్ అయిన డివైజ్ ను అమరుస్తామని తెలిపారు .
వాహనాలలో డివైజ్ ఏర్పాటు ... ఇబ్బంది వస్తే బటన్ నొక్కితే 10 నిముషాల్లో పోలీసులు
తద్వారా వాహనాలలో మహిళలు సేఫ్ గా ప్రయాణించవచ్చని, ఒకవేళ ప్రయాణ సమయంలో ఏమైనా ఇబ్బంది వస్తే, మహిళలు ఆటోలో ఉన్న డివైజ్ లో ప్యానిక్ బటన్ నొక్కగానే అభయం యాప్ ద్వారా సమాచారం పోలీసులకు చేరుతుందని 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారు అని చెప్పారు. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న మహిళలు ఆటో ఎక్కేటప్పుడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటో నంబర్ , ఆటో డ్రైవర్ వివరాలు యాప్ లో నమోదు అవుతాయని, అభయం యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే యాప్ ద్వారా కూడా పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలుస్తుంది .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్ .. దశలవారీగా అమలుకు నిర్ణయం
మొదటిసారిగా 1000 వాహనాలలో ఈ డివైజ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన సీఎం వచ్చే నవంబరు నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం 138 .48 కోట్లు . కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీమ్ కింద 2015 లో రాష్ట్రానికి 80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా గా 55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్ష వాహనాలకు ట్రాకింగ్ డివైజ్లను అమర్చి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.