ఏపీలో ఉచిత బోర్లకు శ్రీకారం ..వైఎస్ఆర్ జలకళ పథకం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video
ఉచిత బోర్లతో సాగునీరందించే లక్ష్యం .. వైఎస్ఆర్ జల కళ ప్రారంభం
మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైయస్సార్ జల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి . చిన్న సన్నకారు రైతుల కోసం బోర్లు వేయడమే కాకుండా మోటర్లు కూడా బిగిస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్సార్ జలకళ కోసం ప్రభుత్వం 2340 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు గా జగన్ ప్రకటించారు . చిన్న సన్నకారు రైతులకు బోర్లు వేయడంతో పాటు మోటర్లు బిగించడం కోసం మరో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.
నియోజకవర్గాల వారీగా వ్యవసాయ భూముల్లో ఉచిత బోర్లు
నియోజకవర్గాల వారీగా బోరు రిగ్గులను ఏర్పాటు చేశామని తెలిపిన జగన్ రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయిస్తామని ప్రకటించారు. సర్వే చేయడానికి ,బోర్ వేసే ప్రాంతాన్ని గుర్తించడానికి, బోర్లు వేయడానికి, మోటార్లు బిగించడానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు.వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకొని చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు . ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిపారు.
పారదర్శకంగా వైఎస్ఆర్ జలకళ.. అమలుకు సామాజిక ఆడిట్
రాష్ట్రంలో రైతాంగానికి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా పేర్కొన్నారు . ఈరోజు ఉచిత బోర్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయనున్నట్లుగా పేర్కొంది. వైయస్సార్ జలకళ పథకం ద్వారా వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. వైయస్సార్ జలకళ ద్వారా వైసీపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నేరవేర్చినట్టు అయ్యింది .
బోర్లే కాదు, మోటార్లు కూడా బిగిస్తామన్న సీఎం జగన్
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నట్లుగా తెలుస్తుంది. బోర్లతో పాటు మోటార్లు కూడా బిగించనున్నారు . రాబోయే 30 ఏళ్ళలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి కూడా నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా మీటర్లు బిగిస్తామని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధానాలనే వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తుందని అందులో భాగంగానే ప్రస్తుతం ఈ పథకం అందుబాటులోకి తెచ్చిందని చెప్తోంది ప్రభుత్వం .