తొలిరోజే 50,449 మందికి ఉద్యోగాలు.. ఆప్కాస్తో ఔట్ సోర్సింగ్ వ్యవస్థలో మార్పులు: సీఎం జగన్
''పాదయాత్ర సమయంలో ఎంతోమంది కాంట్రాక్టు ఉద్యోగులు నా దగ్గరికొచ్చి బాధలు చెప్పుకున్నారు. ఉద్యోగాలు పొందడానికి లంచాలు ఇచ్చామని, తర్వాత జీతం కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్లు సతాయిస్తున్నారని, వచ్చే జీతం కూడా ఏ మూలకు సరిపోవడంలేదని విలపించారు. ఏ జిల్లాలో చూసినా అదే పరిస్థితి ఉండేది. నాటి సీఎం చంద్రబాబు, ఆయన సమీప బంధువు భాస్కర్ నాయుడు తదితరులు ఔట్ సోర్సింగ్ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారు. దాన్ని తిరిగి నిలబెట్టి, యువతను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటయిందే ఆప్కాస్.. '' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం 'ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్' (ఆప్కాస్)ను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఓట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలోగానీ, జీతభత్యాల్లోగానీ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు ఇవ్వరాదనే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తొలిరోజే వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 50,449 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ఆన్ లైన్ లో సీఎం అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందినవాళ్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్' (ఆప్కాస్)కు చైర్మన్ గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యఅధికారులు వ్యవహరిస్తారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకత, ప్రతినెల 1వ తేదీన జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. తొలిరోజు 50,449 మందికి నియామక పత్రాలు ఇవ్వగా, రాబోయే రోజుల్లో సంఖ్యను మరింత పెంచుతామని, ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.