వైఎస్ జగన్కు అరుదైన అవకాశం: నీతి ఆయోగ్ భేటీలో మొట్టమొదటగా మాట్లాడే ముఖ్యమంత్రి!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన దేశ రాజధానికి వెళ్లనున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్.. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతుండటం ఇదే తొలిసారి. అలాగే- కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నీతి ఆయోగ్ భేటీ కావడం కూడా ఇదే తొలిసారి అవుతుంది.
అలిగిన రోజాకు బంపర్ ఆఫర్: ఆ ప్రతిష్ఠాత్మక కార్పొరేషన్కు ఛైర్పర్సన్గా..!
ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు..
నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా వినిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా కోసం విజ్ఞప్తి చేస్తూనే ఉంటానని వైఎస్ జగన్ ఇదివరకే ఢిల్లీ వేదికగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- ఆయన మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ ప్రస్తావించబోతున్నారు. నీతి ఆయోగ్ వేదికగా హోదా డిమాండ్ను లేవనెత్తడం ఇదే తొలిసారి అవుతుంది. నీతి ఆయోగ్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన, కీలక అంశాల గురించి వారు ఈ సమావేశంలో ప్రస్తావించడం, నీతి ఆయోగ్ వేదికగా ప్రధాన మంత్రికి వివరించడం ఆనవాయితీ.
అందరికంటే ముందుగా వైఎస్ జగన్కే అవకాశం..
దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశం ఓ అరుదైన సన్నివేశానికి వేదిక కానుంది. మన దేశంలో ఉన్న మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ భేటీలో వారందరి కంటే ముందుగా మాట్లాడే అవకాశం వైఎస్ జగన్కు దక్కనుంది. దీనికి ప్రధాన కారణం- ఆల్ఫాబేటికల్. ఆంగ్ల అక్షరాల క్రమంలో మన రాష్ట్రం ముందుగా ఉండటం వల్ల అందరి కంటే ముందుగా వైఎస్ జగన్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఓ ముఖ్యమంత్రిగా ఆయన ఈ సమావేశంలో పాల్గొనడం, ప్రసంగించడం ఇదే తొలిసారి అవుతుంది.
అందరి కళ్లూ ఆ అంశం మీదే
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు వారల వ్యవధిలోనే వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీతి ఆయోగ్ భేటీలో ప్రసంగించబోతుండటం ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తొలిసారి కావడం, యువ ముఖ్యమంత్రి కావడం.. ప్రత్యేక హోదా వంటి అత్యంత క్లిష్టమైన, సున్నితమైన డిమాండ్ను తన భుజానికెత్తుకోవడం, దీన్ని అత్యున్నత విభాగమైన నీతి ఆయోగ్లో ప్రస్తావించడం వంటి సందర్భాల్లో వైఎస్ జగన్ ఎలా మాట్లాడతారనే అంశం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అందరి దృష్టీ నీతి ఆయోగ్ మీదే నిలిచింది.
ఏపీ వంటి రాష్ట్రానికి హోదా అవసరం లేదన్ననీతి ఆయోగ్..
విభజన తరువాత ఏర్పాటైన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడం ఏ మాత్రం సాధ్యం కాదని ఇదివరకే నీతి ఆయోగ్ ఛైర్మన్ అరవింద్ పనగరియా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామంటూ ఎన్డీఏ-1 హయాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించగా.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని స్వాగతించారు. అక్కడితో ఆగలేదు. నరేంద్ర మోడీకి, అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతూ నిండు సభలో తీర్మానాన్ని చేసి, కేంద్రానికి పంపించారు. ఆ తరువాత ఆయన యూటర్న్ తీసుకున్నారనుకోండి అది వేరే విషయం.
హోదా..తేనెతుట్టే?
ప్రత్యేక హోదా అనే అంశం తేనెతుట్టె వంటిదే. దీన్ని కదపడానికి ఎన్డీఏ ప్రభుత్వం పెద్దగా సాహసించకపోవచ్చు. అభివృద్ధి సాధ్యపడని ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్నింటికి మాత్రమే ప్రత్యేక హోదా ఉంది. అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల వనరులూ పుష్కలంగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రానికి హోదా ఇవ్వడం సాంకేతికంగా కుదరని అంశం. రాష్ట్ర విభజన సమయంలో అప్పట్లో ప్రతిపక్షంలో కూర్చున్న బీజేపీ నిండు సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు హోదా ప్రకటించాల్సి ఉంటుందనే ఒకే ఒక్క కారణం తప్ప మరేదీ లేదు. ఏపీకి హోదా ప్రకటిస్తే.. కొద్దో, గొప్పో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న తెలంగాణలో కూడా ఈ డిమాండ్ తలెత్తవచ్చు. బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో కూడా ఎన్డీయేతర పక్షాలు ఇదే డిమాండ్ ఆధారంగా కమలనాథులను ఇరుకున పడేయనూ వచ్చు. ఈ పరిస్థితుల్లో అప్పుడెప్పుడో ఇచ్చిన వాగ్దానాన్ని బీజేపీ కట్టుబడి ఉంటుందని, ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా, రెండు ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా ఉన్న ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పట్లో ప్రకటించే అవకాశాలు కనిపించట్లేదు.
వైఎస్ జగన్ ఎలా ఒప్పిస్తారు?
ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారు? ఆయన ఏఏ అంశాలను ఆయన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారు? రాజకీయ లబ్ది అనేది ఏ మాత్రం లేకుండా కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.. రాష్ట్రానికి అంత సులువుగా ప్రత్యేక హోదాను ఇస్తుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. పైగా- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి గానీ, ఎన్డీఏకు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీల అవసరం ఏ మాత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలను అనుసరించి, కేంద్రాన్ని ఒప్పిస్తారనేది వేచి చూడాల్సిందే.