ప్రజా రాజధాని పేరుతో నిధులు వసూళ్లు:మై బ్రిక్-మై అమరావతి విరాళాలు ఏమైనట్టు? వైఎస్ జగన్ ఆరా!
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన వార్తలపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. మై బ్రిక్-మై అమరావతి పేరుతో సాధారణ ప్రజల నుంచి సేకరించిన నిధులు ఏమయ్యాయనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన రాజధాని ప్రాంత అభివృద్ది అథారిటీ (సీఆర్డీఏ) అధికారులతో నిర్వహించబోయే సమీక్ష సందర్భంగా ఆయన ఈ నిధుల గురించి క్షుణ్నంగా చర్చించబోతున్నట్లు సమాచారం.
ప్రజా రాజధాని అంటూ.. ప్రజల నుంచి నిధులు వసూళ్లు!
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా మారుస్తానంటూ అధికారాన్ని అందుకున్న తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రజల నుంచే సేకరించడానికి తక్షణ చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఆరంభించారు. `మై బ్రిక్-మై అమరావతి` పేరుతో ఈ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణానికి తమవంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చే వారు ఈ వెబ్సైట్ ద్వారా ఇటుకలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఒక్కో ఇటుక ఖరీదు 10 రూపాయలుగా నిర్ధారించారు.
లక్షల్లో విరాళాలు..
రాజధాని నిర్మాణానికి ఇటుకలు అనే సెంటిమెంట్తో సాధారణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులను సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రతి సామాన్యుడు కూడా ప్రజా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని చంద్రబాబు అప్పట్లో పిలుపు ఇచ్చారు. సామాన్యులను కూడా భాగస్వామ్యం చేయడానికి 10 రూపాయల నుంచి విరాళంగా చెల్లించవచ్చని అన్నారు. దీనితో తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు ఈ వెబ్సైట్ ద్వారా లక్షల్లో నిధులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలు కూడా ఈ వెబ్సైట్ ద్వారా తమ తాహతుకు అనుగుణంగా స్పందించారు.
గిన్నిస్ రికార్డ్ కూడా..
అప్పట్లో ఈ వెబ్సైట్ గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఒక్కరోజులోనే అత్యధిక ఆన్లైన్ లావాదేవీలను నమోదు చేసిన తొలి వెబ్ సైట్గా నిలిచింది. ‘నా ఇటుక - నా అమరావతి' పేరుతో వెబ్సైట్ను ఆరంభించిన తొలిరోజే 1,05,803 మంది ఇటుకలను అమ్ముడయ్యాయి. ఆ తరువాత కూడా అదే ఒరవడి కొనసాగింది. అమరావతి కోసం ఇటుకలు కొనుగోలు చేస్తున్న ప్రజల సంఖ్య నానాటికి పెరిగింది. కోట్లకు చేరుకుంది.
ఆ నిధులు ఏమయ్యాయో..?
నా ఇటుక- నా అమరావతి ద్వారా లక్షల మంది తమ విరాళాలను అమరావతి నిర్మాణానికి చెల్లించారు. అవన్నీ ఏమయ్యాయో.. దీనికి ఖర్చు పెట్టారో తెలియదు. తాము ఇచ్చిన విరాళాలను ఏ భవన నిర్మాణానికి వినియోగించారు? దేనికి? ఎంత మొత్తంలో వ్యయం చేశారనే విషయం కూడా సామాన్యులకు అంతుచిక్కని వ్యవహారంలా మారింది. ప్రజల విరాళాలకు జవాబుదారీతనం కొరవడిందనే విమర్శలు చెలరేగాయి. విరాళాల సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని విమర్శించారు. వాటిని పెద్దగా పట్టించుకోలేదు గత ప్రభుత్వం.
లెక్కల గురించి ఆరా..
తాజాగా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మై బ్రిక్-మై అమరావతి విరాళాలపై దృష్టి పెట్టారు. ఇప్పటిదాకా ఎంత మంది విరాళాలు ఇచ్చారు? ఆ మొత్తం ఎంతకు చేరుకుంది? విరాళాలను దేనికి ఖర్చు పెట్టారు? ఇప్పటికీ ఇటుకలు అమ్ముడుపోతున్నాయా? అనే అంశాలపై ఆయన ఆరా తీయడానికి సిద్ధమౌతున్నారు. ఈ నెల 6వ తేదీన తాడేపల్లి నివాసంలో సీఆర్డీఏ అధికారులతో ఏర్పాటు చేయబోయే సమీక్షలో దీనికి సంబంధించిన లెక్కలన్నింటిపైనా ఓ సమగ్ర నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. విరాళాలు దుర్వినియోగమైనట్టు తేలితే.. ఏ చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరం.