అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ: పోలవరం, హోదా, హైకోర్టు సహా కీలక అంశాలపై గంటన్నరపాటు చర్చ
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. సుమారు 90 నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు.
Recommended Video
మరో 10 రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ పూర్తి..
రాష్ట్రంలో 332 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని రాబోయే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చేపట్టిన చర్యలను హోంమంత్రికి జగన్ వివరించారు. ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సులు, సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందని, దీనిలో భాగంగానే నూతనంగా 13 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇప్పటికే మూడు కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, మిగిలిన 10 కళాశాలలతోపాటు వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.
అమిత్ షా జీ.. పెంచిన పోలవరం వ్యయాన్ని ఆమోదించండి..
పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా ఆమోదించాలని అమిత్ షాను జగన్ కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రీ నోటిఫికేషన్ జారీ చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. కర్నూలు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టినట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు.
దిశ బిల్లు ఆమోదం లభించేలా చూడండి..
విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖను ఆదేశించాలని జగన్ కోరారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా తగిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిని జగన్ కోరారు.
ఏపీకి ప్రత్యేక హోదా మీదే భారం..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం జగన్. ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి నిధుల వస్తాయి. దీంతో ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుందని, కొత్త పరిశ్రమలు వస్తాయని, మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మిథున్రెడ్డి, అవినాష్రెడ్డి ఉన్నారు.