రాజధానిపై మభ్యపెట్టను.. గ్రాఫిక్స్ చూపను .. ఏపీ రాజధానులపై జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడలోని గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజధాని అంశంపై మాట్లాడారు. మభ్యపెట్టటం, మోసం చెయ్యటం రావని చెప్పిన జగన్ రాజధానిపై గ్రాఫిక్స్ చూపించను అని వాస్తవ పరిస్థితులను బట్టే మాట్లాడతాను అని పేర్కొన్నారు.
ఏపీ రాజధాని రగడ .. కేంద్రం చెప్పింది ఎవరికి అనుకూలం ? ఎవరికి తోచినట్టు వారి ప్రచారం !!
విశాఖనే పరిపాలనా రాజధాని అన్న జగన్
మూడు రాజధానుల ఏర్పాటుకే కట్టుబడిన జగన్ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే నం.1 నగరం అని పేర్కొన్నారు . అంతేకాదు రాజదాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదని తెలిపారు . అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుందని ఆయన పేర్కొన్నారు . ఇక అదే సమయంలో అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు జగన్ మోహన్ రెడ్డి . అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగుతుందన్నారు.
విశాఖ లోనే అన్ని పాలనా వ్యవస్థలు .. రాబోయే తరాలకు అన్ని సదుపాయాలు కల్పించాలన్న సీఎం
విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పిన జగన్ విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని అని పేర్కొన్నారు . ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఉంటుందని తేల్చి చెప్పారు . అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్వోడీ, సచివాలయం ఉంటాయి అని ప్రకటించారు .ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే ప్రాంతాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదని ఆయన అన్నారు . ముఖ్యమంత్రిగా నేను రాబోయే తరం వారికి అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పించాలి అని ఆ బాధ్యత తనపై ఉందని జగన్ పేర్కొన్నారు.
బాహుబలి సినిమా తరహాలో గ్రాఫిక్స్, మభ్యపెట్టటం తనకు రావన్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి బాహుబలి సినిమా తరహాలో గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని , ప్రజలను మభ్యపెట్టాలని కోరుకోవటం లేదన్నారు. జపాన్, సింగపూర్ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు అని వాస్తవ పరిస్థితులకు తగ్గట్టే రాజధానుల నిర్మాణం జరుగుతుందని వ్యాఖ్యానించారు . గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు అని ఆరోపించారు .
అమరావతి శాసన రాజధాని
అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన జగన్ అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయని చెప్పిన ఆయన ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను అంటూ తన మనసులో మాట చెప్పారు .
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్న జగన్
తాను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతున్నానని పేర్కొన్న జగన్ రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించామని జగన్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నానన్నారు . ఈ రాష్ట్రానికి ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశానని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా రాబోయే తరాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్న జగన్ మంచి నిర్ణయం తీసుకోకపోతే రాబోయే తరాల వారి పరిస్థితులను అది దుర్భరం చేస్తుందని జగన్ తెలిపారు.