టీడీపీ మాజీ మంత్రికి వైఎస్ జగన్ చెక్?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే నర్సీపట్నంలో పర్యటించబోతున్నారు. రూ.500 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న మెడికల్ కళాశాలకు జగన్ శంకుస్థాపన చేస్తారు. దీర్ఘకాలికంగా అనావృష్టికి కారణమవుతున్న ఈ ప్రాంతంలో ఏలేరు కాల్వ నీటిని తాండవ రిజర్వాయర్ తో అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. 470 కోట్లరూపాయల ఈ ప్రాజెక్టువల్ల 51వేల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. ప్రధానంగా ఈ రెండు కార్యక్రమాలతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధానంగా ఇది తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గం. ప్రతిరోజు జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. అటువంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా మొదటిసారి జగన్ అడుగుపెట్టబోతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసే సభలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? అనేది ఉత్కంఠగా మారింది. పలుమార్లు మంత్రిగా వ్యవహరించి అయ్యన్న పాత్రుడు చేయలేని పనులను తమ పాలనలో చేస్తున్నామని, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అంటున్నారు.
రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలవడం అనేది నల్లేరు మీద నడకేనని, మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉంటారని చెబుతున్నారు. జగన్ కు ఘనస్వాగతం పలికి సభను భారీగా జరుపుతామని చెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన పెద్ద కుమారుడు విజయ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ విజయ్ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అభివృద్ధి పనులద్వారా అయ్యన్నకు చెక్ పెట్టాలని, ఈసారి కూడా ఇక్కడి నుంచి వైసీపీ గెలుపొందాలనేది జగన్ టార్గెట్ గా ఉంది.