ఎల్లో మీడియాపై మరోసారి జగన్ ఫైర్- నెగెటివ్ రాతలు ఎదుర్కోవాలని స్పందనలో పిలుపు...
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి వంతపాడే మీడియా సంస్ధలపై వైసీపీ కోపం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు తనను జైలుకు పంపారని గతంలో బహిరంగంగానే ఆరోపణలు చేసిన సీఎం జగన్ గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ నేతలను వదిలిపెట్టలేదు. అదే సమయంలో టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న మీడియాపైనా ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఫైర్ అవుతున్నారు.
తాజాగా ఇవాళ ప్రతీ మంగళవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందులో కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మధ్యలో చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రస్తావన వచ్చింది. దీంతో జగన్ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా, నెగటివ్ మైండ్సెట్తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా పోరాడుతున్నామంటూ జగన్ గుర్తుచేశారు. వారు మానసికంగా వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నారని జగన్ పేర్కొన్నారు.
ఎల్లో మీడియా నెగెటివ్గా రాసినా చదువుదాం, మనలో ఏమైనా లోపాలుంటే సవరించుకుందాం. ఒకవేళ తప్పులు జరగకపోయినా రాస్తే దానికి గట్టిగా సమాధానం చెప్పాలని కలెక్టర్లు, ఎస్పీలను జగన్ ఆదేశించారు. ఆయా విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని జగన్ వారికి పిలుపునిచ్చారు. దీంతో అధికారులు కూడా ఇప్పుడు నెగెటివ్ రాతలపై సీరియస్గా వ్యవహరించే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్న కొన్ని మీడియా సంస్ధలకు నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం.. భవిష్యత్తులో కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇస్తోంది.