దావోస్లో సీఎం జగన్: నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం, వరుస సమావేశాలు
దావోస్: స్విట్జర్లాండ్లోని దావోస్లో ఆదివారం నుంచి 26వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం దావోస్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు వెళ్లారు.
జ్యూరిక్ ఎయిర్పోర్టులో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరోఖ్యరాజ్, అధికారులు, స్విట్జర్లాండ్లో ఉంటున్న తెలుగు ప్రజలు సీఎం జగన్కు సాదర స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ కాసేపు ముచ్చటించి కారులో దావోస్కు చేరుకున్నారు. అక్కడ ఏపీ సీఎంకు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కృష్ణగిరి, పలువురు అధికారులు స్వాగతం పలికారు.

ఆదివారంనాటి కార్యక్రమాలు:
వర్డల్ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనున్న కాంగ్రెస్ వేదికగా ఆదివారం ఉదయం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్తో ఏపీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవనరుల తయారీ, స్థిరంగా ఉత్పత్తులు, రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలు, డేటా షేరింగ్, ఉత్పత్తులకు విలువ జోడించడం లాంటి ఆరు అంశాల్లో ఈ ఒప్పందం ద్వారా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రాష్ట్రానికి మార్గనిర్దేశం చేస్తుంది.
డబ్ల్యూఈఎఫ్ హెల్త్కేర్- హెల్త్ విభాగం అధిపతి, డాక్టర్ శ్యాం బిషేన్తోకూడా సీఎం జగన్ సమావేశం అవుతారు.
ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హన్స్ పాల్బర్కనర్తో ముఖ్యమంత్రి ఏపీ లాంజ్లో సమావేశమవుతారు.
ఆదివారం సాయంత్రం డబ్ల్యూఈఎఫ్ కాంగ్రెస్ వేదికలో జరిగే వెల్కం రిసెప్షన్కు సీఎం హాజరవుతారు.