ఫ్రాన్స్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ డిగ్రీ: కుమార్తె కోసం: బెంగళూరుకు జగన్ దంపతులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఫ్రాన్స్లోని ప్రతిష్ఠాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు లభించింది. అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేయబోతున్నారు. ప్రపంచంలోనే టాప్-5 బిజినెస్ స్కూల్స్లో ఇన్సీడ్ ఒకటి. మంగళవారం ఆమె బెంగళూరు నుంచి ప్యారిస్కు బయలుదేరి వెళ్లనున్నారు. పారిస్కు పంపించడానికి వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి మంగళవారం బెంగళూరుకు రానున్నారు. కరోనా సంక్షోభం తరువాత పారిస్లోని ఇన్సీడ్ క్యాంపస్ రీఓపెన్ కావడంతో అందులో చేరడానికి ఆమె బయలుదేరి వెళ్లనున్నారు.
కుమార్తెను పారిస్ పంపించిన అనంతరం వైఎస్ జగన్ దంపతులు యలహంకలోని తమ నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. మంగళవారం అక్కడే బస చేస్తారని, మరుసటి రోజు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారని సమాచారం. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడం వల్ల ప్రొటొకాల్ పాటించట్లేదని చెబుతున్నారు. హర్షారెడ్డి ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదివారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడ విద్యాభ్యాసాన్ని ముగించుకున్న తరువాత.. ఉన్నత చదువుల కోసం ఇన్సీడ్లో చేరనున్నారు.
వైఎస్ జగన్ చిన్నకుమార్తె వర్షా రెడ్డి కూడా విదేశాల్లో చదువుకుంటోన్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఇండియానాలో గల ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో వర్షా రెడ్డికి సీటు లభించింది. వైఎస్ జగన్ దంపతులు స్వయంగా అమెరికా వెళ్లి కుమార్తెను నోట్రెడామ్ యూనివర్శిటీలో చేర్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత కూడా ఆయన వ్యక్తిగత హోదాలోనే అమెరికాకు వెళ్లొచ్చారు. ఈ సారి కూడా ఆయన బెంగళూరుకు వెళ్లడాన్ని వ్యక్తిగత పర్యటనగానే భావిస్తున్నారు. బెంగళూరులోని యలహంక నివాసానికి వెళ్లనుండటం నాలుగేళ్ల తరువాత ఇదే తొలిసారి అవుతుంది.