జస్టిస్ ఎన్వీ రమణపై పోరుకు జగన్ పక్కా ప్లాన్- ప్రధానికీ సమాచారం ? సుప్రీం నిర్ణయంపై ఆసక్తి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 6న ప్రధాని మోడీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు అటు ప్రధాని కార్యాలయం కానీ, ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కానీ బయటపెట్టలేదు. వైసీపీ నేతలు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అంశాలు, జీఎస్టీ, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై జగన్ మోడీతో చర్చించారని చెప్పుకొచ్చారు. కానీ అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత రెండు రోజులకే సీఎం జగన్ సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణపై ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం, దీని వివరాలను రెండు రోజుల తర్వాత ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంతో బయటపెట్టించడంతో ఇదంతా ముందస్తు వ్యూహమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు: తీవ్ర ఆరోపణలు: సమగ్ర విచారణ: ప్రశాంత్ భూషణ్, ఐవైఆర్
ప్రధానితో జగన్ భేటీ...
ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం జగన్ ఈ నెల 6న భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ వ్యూహాత్మక భేటీకి అపాయింట్మెంట్ కూడా రెండు, మూడు రోజుల క్రితమే ఫిక్సయింది. ప్రధాని, ముఖ్యమంత్రి అధికారిక భేటీయే కావడంతో దీని వివరాలు బయటికి వస్తాయని భావించిన వారికి నిరాశ తప్పలేదు. అయితే ఈ భేటీలో జగన్ ప్రధాని మోడీతో మాట్లాడారని భావిస్తున్న అంశాలు బయటికి వస్తే వివాదాస్పదం అయ్యే అవకాశం ఉండటంతోనే ప్రధాని, ముఖ్యమంత్రి కార్యాలయాలు మౌనం పాటించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ వ్యవహారశైలిపై సీఎం జగన్ ప్రధాని మోడీకి వివరించినట్లు ఇప్పుడు అర్ధమవుతోంది. దీనిపై ప్రధాని స్పందన ఏంటో తెలియకపోయినా రెండు రోజుల తర్వాత ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు జగన్ రాసిన లేఖతో ప్రధాని.. జగన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పక్కా వ్యూహంతోనే పోరు..
సాధారణంగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్తో పాటు ఇతర న్యాయమూర్తుల విషయంలోనూ ఆరోపణలు రావడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారుతోంది. పలు సందర్భాల్లో వీటిపై సుప్రీంకోర్టే విచారణ జరిపి తీర్పులు కూడా ఇచ్చింది. అయితే ఆరోపణలపై ఓ ముఖ్యమంత్రి నేరుగా ఛీఫ్ జస్టిస్కు లేఖ రాయడాన్ని బట్టి చూస్తే ఇదంతా వ్యూహాత్మక పోరుగానే అర్ధమవుతోంది. అదీ కాబోయే ఛీఫ్ జస్టిస్గా పరిగణిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ఒత్తిడి పెంచేందుకేనా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖ రాయడంతో ఈ వ్యవహారాన్ని ఆయనకు ముందే చెప్పి ఉంటారన్న ప్రచారం కూడా సాగుతోంది. అక్కడితో ఆగకుండా ఈ లేఖలోని అంశాలను ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని బట్టి చూస్తే ప్రజల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
సుప్రీంకోర్టులోనే బంతి వేసిన జగన్...
జస్టిస్ ఎన్వీ రమణ తీరుపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు చూస్తుంటే ఏపీ హైకోర్టును ఆయనే నడుపుతున్నారనేలా ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని సుప్రీం ఛీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఎన్వీ రమణపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని జగన్ కోరినట్లయింది. ఇది ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు ఇప్పుడు అగ్నిపరీక్షగా మారబోతోంది. కాబోయే ఛీఫ్ జస్టిస్పై ఓ ముఖ్యమంత్రి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ చర్యలు తీసుకుంటారా లేక మౌనంగా ఉండిపోతారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో సుప్రీం కోర్టు జడ్జిలుగా ఉన్న వారిపై, మాజీ జడ్జిలపై పలు ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పులిచ్చింది. అంతెందుకు ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ బాబ్డేపై సామాజిక కార్యకర్త, లాయర్ ప్రశాంత్ భూషణ్ వేసిన కేసును కూడా సుప్రీం ధర్మాసనం విచారించి రూపాయి ఫైన్ కూడా విధించింది. ఇప్పుడు జస్టిస్ ఎన్వీరమణ వ్యవహారంలో సుప్రీం ఏం చర్యలు తీసుకోనుందనే అంశం కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.