చంద్రబాబు జూమ్ కు దగ్గరగా,భూమికి దూరంగా.. పుత్రుడు , దత్తపుత్రుడిని పంపి : జగన్ సెటైర్లు
ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్సార్ రైతు భరోసా , పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుఫాను నష్టపరిహారం చెల్లింపు కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, నివర్ నష్టపరిహారం ఇప్పటికే పలుమార్లు ఇస్తామని చెప్పినప్పటికీ, కావాలని ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ జగన్ వ్యంగ్యం
చంద్రబాబు నాయుడు జూమ్ కు దగ్గరగా, భూమికి దూరంగా ఉంటున్నారని సెటైర్లు వేసిన సీఎం జగన్ చంద్రబాబు కావాలనే పుత్రుడిని, దత్తపుత్రుడిని ఒకరోజు ముందు నివర్ తుఫాన్ వల్ల కలిగిన పంట నష్టానికి పరిహారం ఇవ్వాలంటూ రోడ్డు మీదికి పంపారని ఎద్దేవా చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కావాలని వక్రబుద్ధితోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్ .
చంద్రబాబు హయాంలో అన్నీ బకాయిలే ..
గత ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయకుండా రైతులను నిలువునా ముంచిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 87,612 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కనీసం 12 కోట్లు కూడా చేయలేదని ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ వెల్లడించిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అన్ని బకాయిలను ఎగ్గొట్టారని , ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించిందని సీఎం జగన్ పేర్కొన్నారు.
టీడీపీ బకాయిలు కూడా చెల్లించింది మేమే
టిడిపి ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పారు జగన్. ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు 904 కోట్ల రూపాయలు తీర్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా హితవు పలికారు. రైతుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే రైతులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు జగన్.