కారు నెంబర్ ప్లేటుపై AP CM YS Jagan: సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్: సాధారణంగా ఏ వాహనాలకైనా రవాణా శాఖవారు కేటాయించిన నెంబర్లే ఉంటాయి. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తన కారు నెంబర్కు మొత్తం అక్షరాలను రాసుకున్నాడు. అది కూడా ఓ రాష్ట్రానికి సీఎం పేరు కూడా.
వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో అక్టోబర్ 19న ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారును సిబ్బంది ఆపారు. ఆ కారు నెంబర్ ప్లేటుపై ఉన్న అక్షరాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
కారు నెంబర్ ప్లేటుకు బదులు AP CM YS JAGAN అని రాసివుండటం గమనార్హం. దీంతో ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఇలా నెంబర్ కాకుండా ఇలా ఎందుకు చేశావంటూ పోలీసుల ప్రశ్నించగా.. టోల్ రుసుం మినహాయింపు కోసం ఇలా చేసినట్లు కారు యజమాని ముప్పిడిహరి రాకేశ్ చెప్పాడు.
ఆ తర్వా పోలీసులు ఆ కారును సీజ్ చేసి.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు వివరాలను ట్రాఫిక్ సీఐ వెల్లడించారు. సదరు కారు యజమాని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అని పోలీసులు తెలిపారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ కాకుండా ఇలా పేర్లు, ఇతర వివరాలు ఉంచడం నేరమని తెలిసిందే.
సూర్యపేటలో కార్లు ఢీ
సూర్యపేట జిల్లా మునగాల మండలం మాధవరం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వార్తపత్రిక రిపోర్టర్ నరేందర్ తన భార్యతో కలిసి కోదాడ నుంచి హైదరాబాద్ వైపు కారులో వస్తుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇండికా కారు డివైడర్ దాటి వచ్చి ఆ కారును ఢీకొట్టింది.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన జరిగిన వెంటనే వచ్చి మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను కాపాడారు.