నేడు పోలవరానికి జగన్- ప్రాజెక్టుతో పాటు వైఎస్ విగ్రహ ఏర్పాటు పనుల పరిశీలన
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్ అధికారులతో కలిసి పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు ప్రాంతంలో కొండపై ఏర్పాటు చేయనున్న వైఎస్సార్ విగ్రహ పనులపైనా జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు.
Recommended Video
ఉదయం పదిన్నర సమయంలో హెలికాఫ్టర్లో పోలవరం రానున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 11.40 గంటల వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం 11.50కు ప్రాజెక్టు సమావేశ మందిరానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటల వరకూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఒంటిగంటన్నరకు పోలవరం నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. జగన్ రాక సందర్భంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు చుట్టు పక్కన ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ఉదయం పోలవరం ప్రాజెక్టు హిల్వ్యూ కొండపై జగన్ హెలికాఫ్టర్ దిగుతుంది. అక్కడి నుంచి జగన్ ప్రాజెక్టు పరిసరాలను పరిశీలిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో స్పిల్వేపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనుల వివరాలు తెలుసుకుంటారు. అక్కడి నుంచి స్పిల్వే దిగువ భాగంలో జరుగుతున్న పనులను, గ్యాప్-2 సమీపంలోని హిల్వ్యూ కొండపై నుంచి ఎగువ కాఫర్ డ్యామ్, ఈఆర్సీఎఫ్ డ్యామ్ పనులను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి జగన్ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయనున్న కొండపైకి చేరుకుని అక్కడి పనుల పురోగతి పరిశీలిస్తారు. ఆ తర్వాత సమీక్ష నిర్వహించి అమరావతి బయలుదేరి వెళతారు.