పేదల కోసం మరో పథకం రెడీ: ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ సర్కార్: అచ్చి వచ్చిన సెంటర్లోనే
విజయవాడ: రాష్ట్రంలో మరో పథకం అమల్లోకి రాబోతోంది. జగన్ సర్కార్ దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు లబ్ది కలిగించే స్కీమ్ ఇది. చౌక ధరల డిపోల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకు పంపిణీ చేసే వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన జెండా ఊపి ప్రారంభించబోతోన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ దీనికి వేదిక కానుంది. ఇదివరకు వెయ్యికి పైగా అంబులెన్స్లను ప్రారంభించిన సెంటర్ ఇదే. ఈ సారి దానికి రెండింతల వాహనాలను ఆయన ప్రారంభించనున్నారు.
21వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారని పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,260 వైఎస్సార్ ఇంటింటికీ బియ్యం పంపిణీ వాహనాలు అదే రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రారంభమౌతుంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్ 2,503 వాహనాలను ఆయన ఒకేసారి ప్రారంభిస్తారు. ఆ వాహనాలను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిస్తారు. జెండా ఊపి ప్రారంభించిన వెంటనే ఆ వాహనాలు ఈ మూడు జిల్లాలకు తరలి వెళ్తాయి.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
21వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ నాటికి బియ్యం పంపిణీ వాహనాలను పౌర సరఫరాల శాఖ గిడ్డంగులకు కేటాయిస్తారు. 31వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో మాత్రమే ట్రయల్ రన్ నిర్వహిస్తారని తెలుస్తోంది.
ఆ మరుసటి రోజు నుంచే ఈ వాహనాల ద్వారా తెల్లరేషన్ కార్డు లబ్దిదారుల ఇళ్ల వద్దకు బియ్యాన్ని పంపిణీ చేస్తారు. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు బియ్యాన్ని చేరవేయడంపై దృష్టి సారించారు.