అమరావతి నిర్మాణ పనులపై 6న వైఎస్ జగన్ సమీక్ష: అధికారుల్లో హైరానా..హైటెన్షన్!
అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఒక్కో శాఖ పనితీరుపై తాడేపల్లిలోని తన అధికారిక నివాసంలో సమీక్షలు చేస్తూ వస్తోన్న ఆయన.. ఈ నెల 6వ తేదీన రాజధాని పనుల నిర్మాణం, పనుల పురోగతిపై సమీక్ష చేపట్టబోతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ సమీక్ష ఉంటుందని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) అధికారులకు సమాచారం వెళ్లింది.
దీనితో సీఆర్డీఏ అధికారుల్లో హైటెన్షన్ ఆరంభమైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజధాని నిర్మాణ పనులను వైఎస్ జగన్ సమీక్షించడం ఇదే తొలిసారి. తప్పుడు నివేదికలు ఇస్తే.. తోలు తీసే పరిస్థితి ఎదురు కావచ్చనే భయం అధికారుల్లో వ్యక్తమౌతోంది.
తాత్కాలిక భవనాల ఖర్చుపై ఆరా..
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలంలో రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాల పురోగతిని వైఎస్ జగన్ సమీక్షిస్తారు. నిర్మాణ పనులను పొందిన కాంట్రాక్టర్ల వివరాలతో పాటు ఏ నిర్మాణానికి ఎంత అంచనా వ్యయాన్ని నిర్ధారించారనే అంశాలపై సమీక్ష ఉంటుంది. చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సచివాలయం, హైకోర్టు, శాసన సభ, శాసన మండలి భవనాలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. దీనికోసం ఎంత ఖర్చు చేశారు? ఆ నిర్మాణ పనులను ఏ కాంట్రాక్టు సంస్థకు చెల్లించారు? ఆ సంస్థకు ఎంత మొత్తంలో బిల్లులు చెల్లించారు? అనే అంశాలపైనే ప్రధానంగా సమీక్ష ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన చెల్లింపులు, బిల్లులు, నివేదికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఆర్డీఏ అధికారులకు సమాచారం వెళ్లింది.
స్తంభించిన నిర్మాణ పనులు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన మరుక్షణమే- కాంట్రాక్టు పనులన్నింటినీ నిలిపివేయాలంటూ వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఆధీనంలో చేపట్టిన నిర్మాణ కాంట్రాక్టు పనుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన సంస్థలే అధికంగా ఉన్నాయి. అవసరానికి మించి అధికంగా బిల్లులను చెల్లించారని, కాంట్రాక్టర్ల పెద్ద ఎత్తున ముడుపులను తీసుకుంటున్నారని గతంలో ప్రతిపక్ష నేతగా స్వయంగా వైఎస్ జగనే ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి.
దీనిపై పక్కా సమాచారం ఉండటం వల్లే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా- కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులపై అధికారికంగా సమీక్ష చేయనున్నారు. వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం సహా అన్ని చోట్ల నిర్మాణ పనులు స్తంభించాయి. శాఖలవారీగా ఆయా నిర్మాణ పనులను పరిశీలించిన తరువాతే బిల్లుల చెల్లింపులకు అనుమతి ఇస్తుంది ప్రభుత్వం. అధికంగా చెల్లించి ఉంటే- వాటిని వెనక్కి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అధికారుల్లో హైటెన్షన్..
6వ తేదీన వైఎస్ జగన్ అమరావతి నిర్మాణ పనులను సమీక్షిస్తారంటూ సమాచారం అందిన నేపథ్యంలో..సీఆర్డీఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ అయిదేళ్ల పాటు కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం, వ్యక్తిపూజ, ఆర్భాట ప్రచారం ప్రధానంగా పరిపాలన సాగిందని, అధికారుల ప్రమేయం లేకుండా, బడా కాంట్రాక్టర్లు, చంద్రబాబు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల వల్ల అధిక మొత్తంలో బిల్లులను చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యకమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు తాము సమాధానం చెప్పగలమా? లేదా? అని సీఆర్డీఏ అధికారులు ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవురోజైనప్పటికీ.. అధికారులు కార్యాలయంలో సాయంత్రం వరకూ గడిపినట్లు తెలుస్తోంది.
కన్సల్టెంట్లను కొనసాగిస్తారా? చెక్ పెడతారా?
పదవీ విరమణ చేసిన కొందరు ప్రభుత్వ అధికారులు సీఆర్డీఏలో కన్సల్టెంట్లుగా కొనసాగుతున్నారు. ముఖ్య కార్యదర్శి స్థాయిలో పనిచేసి, పదవీ విరమణ పొందిన ఐఎఎస్ అధికారుల సేవలను సీఆర్డీఏ అధికారులు కన్సల్టెంట్ల రూపంలో వినియోగించుకుంటోంది. వారికి పెద్ద మొత్తంలో గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది. తన సమీక్ష సందర్భంగా వైఎస్ జగన్.. కన్సల్టెంట్ల అంశాన్ని కూడా సమీక్షిస్తారని సమాచారం. కన్సల్టెంట్ల సేవలను రద్దు చేస్తారా? లేక కొనసాగిస్తారా? అనే విషయం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.