టార్గెట్ 2021: కేంద్రానికి రూ.15 వేల కోట్ల సాయం అడిగిన జగన్: ప్రధానికి లేఖ
అమరావతి: రాష్ట్ర జీవనాడిగా గుర్తింపు పొందిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పురోగతిని వివరించారు. చేసిన ఖర్చు మొత్తాన్నీ వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున ఇప్పటిదాకా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు మొత్తాన్ని చెల్లించాలని విజ్ఙప్తి చేశారు. 3805.62 కోట్ల రూపాయలను ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి వ్యయం చేసిందని, దీన్ని చెల్లించాలనీ కోరారు. ఈ మొత్తాన్ని సకాలంలో రీఎంబర్స్ చేయడం వల్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయొచ్చని అన్నారు.
విశాఖకు జగన్ సర్కార్ మరో వరం: భీమిలీ టు భోగాపురం: ఇండస్ట్రియల్ క్లస్టర్?
15 వేల కోట్లు అవసరం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మొత్తాన్ని రుణరూపంలో సేకరించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ భారీ మొత్తాన్ని రుణంగా సేకరించడానికి నాబార్డును ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని తాము లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీన్ని అందుకునేలా సహకరించాలనీ వైఎస్ జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే లక్షలాది హెక్టార్లను అదనంగా సాగు పరిధిలోకి తీసుకుని రావచ్చని అన్నారు.
15 వేల కోట్లు ఎందుకంటే..
ఈ 15 వేల కోట్ల రూపాయలు ఎందుకు అవసరమౌతాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ లేఖలో వివరించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలను నిర్మించడానికి అయిదు వేల కోట్ల రూపాయల చొప్పున అవసరం అవుతాయని అంచనా వేసినట్లు చెప్పారు. నిర్వాసితులకు కల్పించాల్సిన పునరావాసాలు, కాలనీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు మరో అయిదు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనాలను రూపొందించినట్లు చెప్పారు. నిర్వాసితులను వచ్చే ఏడాది మార్చి నాటికి పునరావాస కాలనీలకు తరలించేలా చర్యలను చేపట్టామని తెలిపారు.
Recommended Video
నిర్వాసితులకు ఆర్థిక ప్యాకేజీలు..
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నదున పోలవరం నిర్వాసితులను దశలవారీగా పునరావాస కాలనీలకు తరలించాలని నిర్ణయించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిర్వాసితులకు ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సకాలంలో నిధులు కేటాయించాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటిదాకా తాము చేసిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల ఆయా నిర్వాసితులకు మౌలిక సదుపాయాలను కల్పించే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి వెసలుబాటు ఉంటుందని జగన్ పేర్కొన్నారు.