ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ నిషేధం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఏపీ సీఎం జగన్ లేఖ
అమరావతి: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్లను నిషేధించాలని లేఖలో జగన్ కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్సైట్లు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్కు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ బెట్టింగ్, గాంబ్లింగ్ యాప్లు వెబ్సైట్లకు ముఖ్యంగా యువత బానిసలవుతున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారని సీఎం లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయా సైట్లను బ్లాక్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఏపీలో ఆయా సైట్లు, యాప్లను బ్లాక్ చేసేలా ఆదేశించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ను సీఎం జగన్ ఆ లేఖలో కోరారు.
ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు: ఎస్ఈసీతో సీఎస్ నీలం సాహ్ని భేటీ
Recommended Video
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణఫై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సీఎస్ సాహ్ని ఆయనతో భేటీ అయ్యారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఆయనకు సీఎస్ తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని నీలం సాహ్ని స్పష్టం చేశారు. రాస్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నామని, అయితే, పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని తెలిపారు.