Reliance Oxygen: మళ్లీ ప్రధానికి వైఎస్ జగన్ లేఖ: రోజూ 80 మెట్రిక్స్: మొత్తం సీమకే
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోన్న లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోసం ఆయన మోడీకి తాజాగా లేఖ రాశారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత వరుసగా లేఖలను రాస్తోన్న వైఎస్ జగన్.. ఈ ప్రక్రియను కొనసాగించినట్టయింది. ఇప్పటిదాకా ఆయన రాసిన లేఖల పట్ల సానుకూలతను వ్యక్తం చేసిన ప్రధాని.. దీనికి ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
జామ్నగర్ ప్లాంట్ నుంచి
కరోనా వైరస్ బారిన పేషెంట్లకు అందించడానికి ఉద్దేశించిన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొరత నెలకొన్న పరిస్థితుల్లో.. దీన్ని అధిగమించడానికి రిలయన్స్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రోజూ 1,000 మెట్రిక్ టన్నుల మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తయారు చేస్తోందా సంస్థ.
దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే మెడికల్ ఆక్సిజన్తో పోల్చుకుంటే.. 11 శాతం. రిలయన్స్ యాజమాన్యానికి గుజరాత్లోని జామ్నగర్లో రిఫైనరీ ప్లాంట్ ఉంది. అక్కడే- మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
రోజూ 80 మెట్రిక్ టన్నులు..
జామ్నగర్ ప్లాంట్లో రిలయన్స్ యాజమాన్యం ఉత్పత్తి చేస్తోన్న ఆక్సిజన్లో కొంతభాగాన్ని రాష్ట్రానికి కేటాయించాలని వైఎస్ జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రోజూ 80 మెట్రిక్ టన్నుల మేర ప్రాణవాయువును సరఫరా చేయాలని కోరారు. దీనికోసం జామ్నగర్ నుంచి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను నడిపించాలని సూచించారు. దీన్నంతటినీ తాము రాయలసీమ ప్రాంతానికి వినియోగిస్తామని వివరించారు.
ఆక్సిజన్ కొరత వల్ల తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో 11 మంది పేషెంట్లు కన్నుమూసిన సందర్భాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గేంత వరకూ ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని అన్నారు.
రాయలసీమ జిల్లాల్లో ఆక్సిజన్ డిమాండ్ అధికం..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెల్లువలా విరచుకుపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఆక్సిజన్ డిమాండ్ అధికంగా ఉంటోందని వైఎస్ జగన్ వివరించారు. దీన్ని అధిగమించడానికి ఒడిశా నుంచి ఐఎస్ఓ కంటైనర్ల ద్వారా ఆక్సిజన్ను తెప్పించుకుంటున్నామని చెప్పారు. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటకల నుంచి ట్యాంకర్లను రప్పిస్తున్నామని చెప్పారు.
రవాణాలో నెలకొంటోన్న జాప్యం వల్ల అవాంఛనీయ పరిస్థితులు ఉత్పన్నతమౌతోన్నాయని అన్నారు. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండట్లేదని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జామ్నగర్లో రియలన్ప్ ఇండస్ట్రీస్కు చెందిన ప్లాంట్ నుంచి రోజూ 80 మెట్రిక్ టన్నుల మేర ప్రాణవాయువును రాష్ట్రానికి కేటాయించాలని కోరారు.