కలాంకు అవమానం: తప్పు సరిదిద్దిన ఏపీ సీఎం.. రాజకీయ దుమారంతో సర్కార్ వెనక్కు!
ఏపీలో ప్రతిభా పురస్కరాల పేరును మార్చుతూ ఏపీ ప్రభుత్వ అధికారులు తీసుకొన్న నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయి నిరసన వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో కలాంకు తీరని అవమానం అంటూ ఓ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అధికారుల నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీఎం జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు.
సీఎం దృష్టికి రాకుండా పేరు మార్పు
గత కొన్నేళ్లుగా ఏపీలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చాటుకొన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం పేరిట పురస్కారాలు ఇస్తున్నారు. అయితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొన్ని పథకాలు, కార్యక్రమాల పేర్లను మార్చే అంశాన్ని చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకురాకుండా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా విద్యా పురస్కారం పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
దాంతో కలాం పేరు మార్చడంపై రాజకీయ వర్గాలు, సామాజిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో ఈ అంశం ట్రెండింగ్గా మారింది. #YSRCPInsultsAPJAbdulKalam ట్యాగ్ ఇప్పుడు వైరల్ అయింది. దాంతో సీఎం వైఎస్ జగన్ రంగంలొకి దిగారు. ప్రభుత్వం అందజేసే అవార్డులకు మహనీయుల పేరు పెట్టాలని సీఎం సూచించినట్టు తెలిసింది. మహాత్మ గాంధీ, పూలే, జగ్జీవన్ రాం, అంబేద్కర్ లాంటి గొప్ప నేతల పేర్ల అవార్డుల ఇవ్వాలని అధికారులకు తెలిపినట్టు సమాచారం.
ఏపీ సీఎం ఆగ్రహం
అలాగే తన దృష్టికి రాకుండా కలాం పేరు మార్చడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చుతూ తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఇచ్చిన జీవోను రద్దు చేయాలి. యథాతథంగా అబ్దుల్ కలాం పేరుతో ఆ పురస్కారాన్ని కొనసాగించాలని ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
జనసేన విమర్శలు
కలాం పేరు మార్పుపై జనసేన పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇప్పటికే అస్తవ్యస్త పాలనను సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశ గర్వించదగిన హీరోలను అవమానించే కార్యక్రమానికి దిగింది అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది. జాతీయ జెండాను అగౌరవ పరిచిన ప్రభుత్వం ఇప్పుడు కలం సేవలను కూడా విస్మరించింది. ఆయనకు అగౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించింది అని ట్వీట్లో పేర్కొన్నది.