వాలంటీర్లు రోడ్డెక్కడం బాధించింది, వారి కుట్రలో భాగం కావొద్దు: వైఎస్ జగన్ భావోద్వేగ లేఖ
అమరావతి: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నియమించుకున్న గ్రామ, వార్డు వాలంటీర్లు వేతనాలు పెంచాలంటూ రోడ్డెక్కారు. రూ. 5 వేల గౌరవ వేతనంతో వీరిని ప్రభుత్వం నియమించగా.. ఇప్పుడు దాన్ని రూ. 12 వేలకు పెంచాలంటూ వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆందోళన చేస్తున్నవాలంటీర్లకు చెల్లెళ్లు, తమ్ముళ్లు అంటూ భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంపారు.
వాలంటీర్లకు ఇస్తున్నది వేతనం కాదు..
ఏపీలోని గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భృతి అని వైఎస్ జగన్ తన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకే గౌరవభృతి ఇస్తున్నట్లు తెలిపారు. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు.
వాలంటీర్లు రోడ్డెక్కడం ఎంతో బాధించింది: వైఎస్ జగన్
జీతాలు పెంచాలంటూ కొంతమంది గ్రామ, వార్డు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కడం ఎంతో బాధించిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అందించే పౌరసేవలను ప్రజల ఇంటివద్దకే అందించేలా ఈ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు.
జీతం కోసం గౌరవం ఉండదు..
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న సదుద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లను ఆప్తులుగా, ఆత్మీయులుగా చూసుకుంటున్నారు. స్వచ్ఛందంగా కాకుండా ఇదే పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం దక్కదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. గొప్పగా సేవలందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుంది. ప్రభుత్వం సత్కరిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
వాలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసే కుట్రలు: వైఎస్ జగన్
అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు నియోజకవర్గాల ప్రాతిపదికన ఏటా ఒక రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను లేకుండా చేయాలన్న దురాలోచనతో కొందరు కుట్రలు పన్నుతున్నారు. ప్రలోభాలకు గురికాకుండా, వాటికి దూరంగా ఉంటూ కర్తవ్యాన్ని నిర్వహించాలని మీ శ్రేయోభిలాషిగా విజ్ఞప్తి చేస్తున్నా' అని సీఎం జగన్ తన బహిరంగ లేఖలో స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.6 లక్షల మంది వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.