తమిళనాడులో జల్లికట్టు, ఏపీలో కోడిపందేలు: టిడిపి-బిజెపి కాక్ఫైట్ గేమ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కోడిపందేలను గుర్తించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాని ఏపీలోని కోస్టల్ జిల్లా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఇటీవల తమిళనాడులో జల్లికట్టును కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడిపందేలను గుర్తించాలని కూడా వారు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరనున్నారు.
బిజెపి నేత కె రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ... ఈ విషయమై తాము తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చిస్తున్నామని చెప్పారు. కోడిపందేలను గుర్తించాలని తాము కోరుతామన్నారు. ఈ ఏడాది తాము ఈ విషయంలో విజయవంతం కాకపోయినప్పటికీ, వచ్చే ఏడాది సాధిస్తామని చెప్పారు.
తమ ప్రాంతంలో ఎనభై శాతం మంది ప్రజలు కోడిపందేలు కావాలని కోరుకుంటారన్నారు. జల్లికట్టును సుప్రీం కోర్టు బ్యాన్ చేసిందని, అందుకే దాని పైన కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. కానీ కోడిపందేల పైన అలాంటి బ్యాన్ ఏదీ లేదని చెప్పారు.