మాస్ లీడర్గా.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా: ఇందిరమ్మ రాజ్యనికి: ఆ ఘనత మాదే: వైఎస్కు నివాళి
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. వైఎస్ఆర్ 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయనకు నివాళి అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వాన్ని వహించిన వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయనను పేదల ప్రజల్లో దేవుడిగా నిలిపిందని పేర్కొన్నారు. వైఎస్ మహానేతగా ఆవిర్భవించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమైందని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బ్రాండ్నేమ్గా మార్చుకుంది. ప్రజల్లో వైఎస్కు ఉన్న ఇమేజ్, ఓటుబ్యాంకు వైఎస్ఆర్సీపీ వైపు మళ్లింది. ఫలితంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిందనేది తెలిసిన విషయమే. వైఎస్ను తమవాడిగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు ప్రజలు.
వైఎస్ ఆ స్థాయిలో ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకోవడానికి కాంగ్రెస్ కారణమని మరోసారి స్పష్టం చేశారు పీసీసీ నేతలు. ఆయనకు నివాళి అర్పించిన సందర్భంగా వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అంటూ రాష్టంలో ప్రతి పేదవాడికి సహాయం అందించారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిన మహానేత అని చెప్పారు. జలయజ్ఙం పేరుతో భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, వాటి పునరుద్ధరణకు పూనుకున్నారని, వాటికి ఊపిరిపోశారని అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా నిరుపేదల కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువులకు బాటలు పరిచారని చెప్పారు.
కరోనా గురించి ఒళ్లు జలదరించే నిజం: బ్రెయిన్ డ్యామేజ్..నిర్వీర్యం: లండన్ వర్శిటీ పరిశోధనల్లో
108, 104 అంబులెన్సుల సేవలను ప్రవేశపెట్టడం ద్వారా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఓ సంచలనానికి తెర తీశారని, ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఈ అంబులెన్స్ల వ్యవస్థను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ను యుగానికి ఒక్కడిగా స్మరించుకున్నారు. రైతులు, మహిళలకు స్వయం సమృద్ధిని కల్పించడానికి వైఎస్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ను అందించడం చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. రాజకీయాల్లో పేదల ప్రజల నాడి తెలిసిన మాస్ లీడర్గా వైఎస్ ఆవిర్భవించడానికి కాంగ్రెస్ ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు.